తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిపై (CM Revanth Reddy) అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ (Balmuri Venkat)సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేటీఆర్.. రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. అలాగే సోషల్ మీడియాలో కౌశిక్రెడ్డి చేసిన పోస్టులు ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా అభ్యంతరకరంగా ఉన్నాయని తెలిపారు. ఈ పోస్టులు సీఎంను ఉద్దేశపూర్వకంగా కించపరచడమే కాకుండా పరువు నష్టం కలిగించేలా ఉన్నాయన్నారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కేటీఆర్ వ్యాఖ్యలు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ కు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు.
అనంతరం బల్మూరి వెంకట్ మీడియాతో మాట్లాడుతూ.. ఉద్దేశపూర్వకంగానే ముఖ్యమంత్రి పరువుకు నష్టం కలిగించేలా ఈ పోస్టులు, వ్యాఖ్యలు ఉన్నట్లు ఫిర్యాదు చేశామన్నారు. ఇలాంటి చర్యలు ప్రజల చేత ఎన్నికైన నాయకుడిని కించపరచడమే కాకుండా సున్నితమైన రాజకీయ వాతావరణానికి విఘాతం కలిగిస్తాయని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి కుర్చీని గౌరవించాలని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. మరి ఇప్పడు ఆయన కుమారుడే ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేటీఆర్, కౌశిక్ రెడ్డి తీరుపై అసెంబ్లీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
కాగా బుధవారం ఉదయం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వంద జన్మలెత్తినా రేవంత్ రెడ్డి అనే చిల్లరగానికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదంటూ ఘాటు విమర్శలు చేశారు. రేవంత్ గురువు, ఆయన జేజమ్మతోనే కొట్లాడినవాడు కేసీఆర్ అన్నారు. ఇలాంటి చిల్లర ముఖ్యమంత్రి.. చిల్లర ప్రభుత్వానికి ఇంతకంటే ఎక్కువ తెలివితేటలు ఉంటాయని తాను అనుకోవడం లేదన్నారు. ఎన్ని కుట్రలు చేసినా.. ఎన్ని కేసులు పెట్టినా.. ప్రజల తరపున రేవంత్ రెడ్డి పాలనను ఎండగడుతూనే ఉంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీని బొందపెట్టేదాకా వెంటాడుతూనే ఉంటామని వార్నింగ్ ఇచ్చారు.