ఫోన్ ట్యాపింగ్ కేసులో(phone tapping case) ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు(Prabhakar Rao)పథకం ప్రకారమే లొంగిపోయి సిట్ విచారణకు హాజరయ్యారని కేంద్ర మంత్రి బండిసంజయ్(Bandi Sanjay)తెలిపారు. అమెరికాలో ప్రభాకర్ రావుకు కేసీఆర్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ పూర్తయిందని.. అందుకే ఇండియా వచ్చారని ఆరోపించారు. సిట్ విచారణలో ప్రభాకర్ రావు వాంగ్మూలం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఎంతోమంది కార్యకర్తల ఉసురుపోసుకున్న వ్యక్తి ప్రభాకర్ రావు అని ధ్వజమెత్తారు. ఎన్నో కుటుబాలు రోడ్డున పడ్డాయని ఫైర్ అయ్యారు.
తనతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు, జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేసిన ఘనుడు ప్రభాకర్ రావు అని మండిపడ్డారు. భార్యభర్తల ఫోన్ సంభాషణలను కూడా ట్యాప్ చేసిన నీచుడు అని మండిపడ్డారు. ఎవరి ఆదేశంతో ఫోన్ ట్యాప్ చేశారో ప్రజలకు తెలియాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేశాక ఏం చేశారు? ఆ ఆడియోలను ఎవరికి పంపారు? వాటిని అడ్డుపెట్టుకుని ఎవరెవరిని బెదిరించారు..? తేలాలన్నారు.
రోజురోజుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసనం సన్నగిల్లుతోందని విమర్శించారు. ఏ ఒక్క అవినీతి కేసులో కూడా విచారణ ముందుకు సాగడం లేద్నారు. ఈ కేసుకు సంబంధించిన అయినా కోర్టులో గట్టిగా వాదనలు వినిపించి ప్రభాకర్ రావు, ఆయన వెనుకున్న సూత్రధారులను దోషులుగా తేల్చాల్సిందేని బండి ప్రభుత్వాన్ని నిలదీశారు.
కాగా తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్నలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టాలని భావిస్తున్నారు.
ఈ కేసు నమోదుకాగానే ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. అప్పటి నుంచి తిరిగి రాకపోవడంతో పాస్ పోర్టు రద్దు చేయించారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే అరెస్ట్ చేయవద్దని పోలీసులకు సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 14 నెలల తర్వాత అమెరికా నుంచి ఆదివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు.