తెలంగాణకు సంబంధించిన పెండింగ్ సమస్యల గురించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అధ్యక్షతన ఇవాళ ప్రజాభవన్లో అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి రావాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు ఇతర ఎంపీలకు భట్టి స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు.
అయితే ఈ సమావేశానికి హాజరుకాకూడదని బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు భట్టి విక్రమార్కకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) లేఖ రాశారు. ఎంపీల సమావేశానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తమ ఎంపీలకు శుక్రవారం రాత్రి ఆలస్యంగా సమాచారం అందిందని చెప్పారు. ఎంపీలకు వారి నియోజకవర్గంలో ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయని .. ఈ కార్యక్రమాల వల్ల భేటీకి హాజరు కాలేకపోతున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఉంటే కాస్త ముందుగా చెప్పాలని సూచించారు.