Saturday, November 15, 2025
HomeTop StoriesDriverless Vehicle : బీటెక్ బుర్రల బ్రహ్మాస్త్రం.. డ్రైవర్ లేకుండానే దూసుకెళ్లే వాహనం!

Driverless Vehicle : బీటెక్ బుర్రల బ్రహ్మాస్త్రం.. డ్రైవర్ లేకుండానే దూసుకెళ్లే వాహనం!

Student-led automotive innovation : తరగతి గదుల్లోని పాఠాలకు తమ ప్రతిభను జోడించారు. ఆలోచనలకు ఆవిష్కరణను జతచేశారు. ఫలితంగా ఓ అద్భుతం రూపుదిద్దుకుంది. అదే డ్రైవర్ అవసరం లేకుండానే పరుగులు పెట్టే వాహనం. మెదక్ జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థులు ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. పెట్రోల్, డీజిల్ గొడవే లేకుండా, అత్యాధునిక సాంకేతికతతో నడిచే ఈ వాహనాన్ని రూపొందించి జాతీయ స్థాయిలో సత్తా చాటారు. మరి ఈ యువ ఇంజనీర్ల బృందం ఈ ఘనతను ఎలా సాధించింది? ఈ వాహనం ప్రత్యేకతలేంటి?

- Advertisement -

విభాగాల సమన్వయం.. విద్యార్థుల నైపుణ్యం : ఈ అద్భుత ఆవిష్కరణ వెనుక మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లోని బీ.వీ రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీవీఆర్‌ఐటీ) విద్యార్థుల సమిష్టి కృషి దాగి ఉంది. మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్… ఇలా మూడు కీలక విభాగాలకు చెందిన 30 మంది విద్యార్థులు ఒక బృందంగా ఏర్పడి ఈ డ్రైవర్‌లెస్ వాహనానికి ప్రాణం పోశారు.

మెకానికల్ విద్యార్థులు: వాహనానికి అవసరమైన బాడీ, ఛాసిస్ వంటి నిర్మాణ బాధ్యతలను వీరు స్వీకరించారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ విద్యార్థులు: వాహనం స్వయంగా నడిచేందుకు అవసరమైన ‘ఇంద్రియాల’ వంటి సెన్సార్లు, కెమెరాలు, యాక్చుయేటర్లను అమర్చారు.

కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు: వాహనానికి ‘మెదడు’ లాంటి కోడింగ్‌ను అభివృద్ధి చేశారు. సెన్సార్ల నుంచి వచ్చే సమాచారాన్ని విశ్లేషించి, వాహనం ఎలా ముందుకు సాగాలో, ఎక్కడ ఆగాల్లో నిర్దేశించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అల్గారిథమ్‌లను రాశారు.

సాంకేతికతతో పరుగులు : ఈ వాహనం డ్రైవర్ లేకుండా నడవడానికి ప్రధానంగా రేడార్, సెన్సార్, కెమెరాల టెక్నాలజీని ఉపయోగించారు. సెన్సార్ల సహాయంతో ఎదురుగా వచ్చే వాహనాలను, మనుషులను లేదా ఇతర అడ్డంకులను ఇది పసిగడుతుంది. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే దానంతట అదే బ్రేకులు వేసుకుని ఆగిపోతుంది. తొలుత సాధారణ ఎలక్ట్రిక్ వాహనంగా ఉన్న దీనిని, డ్రైవర్‌లెస్ వాహనంగా మార్చే క్రమంలో విద్యార్థులు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. పలుమార్లు విఫలమైనా, పట్టువదలకుండా ఫీడ్‌బ్యాక్‌ను స్వీకరించి, ఒక్కో విభాగంలో మార్పులు చేసుకుంటూ విజయం సాధించారు.

జాతీయ స్థాయిలో జయభేరి : తమ కళాశాల తరఫున ‘టీం ఏ-అఫెండర్స్‌’ పేరుతో బరిలోకి దిగిన ఈ విద్యార్థుల బృందం, తొలి ప్రయత్నంలోనే అద్భుత ప్రతిభ కనబరిచింది. చెన్నైలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఏకంగా నాలుగు విభాగాల్లో బహుమతులు గెలుచుకుంది. ఏడీఏఎస్ లెవల్-2 ప్రమాణాలతో డ్రైవర్‌రహిత వాహనాన్ని రూపొందించి ‘బెస్ట్‌ టీం’ కింద ప్రథమ బహుమతిని సొంతం చేసుకోవడం విశేషం.

ఈ విజయంపై మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి వరణ్ హర్షం వ్యక్తం చేశారు. “కోర్ విభాగాల్లో ఉద్యోగాలు రావట్లేదనే ఆందోళనల నడుమ, మెకానికల్, ఎలక్ట్రికల్ విద్యార్థులు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఇంతటి అత్యాధునిక వాహనాన్ని తయారు చేయడం గొప్ప విషయం. ఇది వారి ఉపాధి అవకాశాలను కచ్చితంగా మెరుగుపరుస్తుంది” అని ఆయన అన్నారు. కళాశాలల ప్రోత్సాహం, సొసైటీ ఫర్ ఆటోమోటివ్ ఇంజినీరింగ్ వంటి సంస్థల సహకారంతో విద్యార్థుల్లోని సృజనాత్మకతకు సరైన వేదిక లభిస్తోందని అధ్యాపకులు అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad