తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతేడాది ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెంలో కాంగ్రెస్ నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు పరువు నష్టం దావా వేశారు. బీజేపీకి పరువు నష్టం కలిగేలా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదుచేశారు. కాసం పిటిషన్ను విచారణకు స్వీకరించిన ప్రజాప్రతినిధుల కోర్టు విచారణలో భాగంగా సాక్షుల వాంగ్మూలం నమోదు చేసింది. ఈ సందర్భంగా రేవంత్ ప్రసంగం ఆడియో, వీడియో క్లిప్పింగ్లను సైతం కోర్టుకు సమర్పించారు.
ఈ నేపథ్యంలో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో నమోదైన కేసును కొట్టేయాలని సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అలాగే కోర్టు హాజరు నుంచి కూడ తనకు మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.