మూడు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తన పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరారు. ఈ సందర్భంగా మీడియాతో చిట్చాట్ నిర్వహించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీలో ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుల అంశం ప్రస్తావనకు రాలేదన్నారు. తన వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయియించనున్నట్లు చెప్పారు. ఢిల్లీకి వచ్చింది కర్ణాటకలో కులగణన అంశంపై అధిష్టానంతో చర్చించేందుకని తెలిపారు. తెలంగాణలో కులగణన ఎలా చేపట్టామనే దానిపై వివరణ ఇచ్చానన్నారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణకు శత్రువులు అని ధ్వజమెత్తారు. తాను ఉన్నంత వరకు కాంగ్రెస్లోకి కల్వకుంట్ల కుటుంబానికి ఎంట్రీ లేదని తేల్చి చెప్పారు. రౌడీ గ్యాంగ్ మాదిరిగా బీఆర్ఎస్ నేతల తీరు ఉందని విమర్శించారు. మీడియా దృష్టిని తమవైపు తిప్పుకునేందుకు బీఆర్ఎస్ నేతలు డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు.
రెండు రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై (Kaleswaram) మీడియాతో మాట్లాడుతానని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు బయటపెడతానని పేర్కొన్నారు. ఇక కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని.. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నదని ఆయనేనని ఆరోపణలు చేశారు. రాష్ట్రానికి ఆయన ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదని మండిపడ్డారు. మెట్రో విస్తరణ కేటీఆర్కు ఇష్టం లేదు కాబట్టే కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు, కిషన్రెడ్డి ఒక్కటేనన్నారు.
కాగా కొత్త మంత్రులకు తన వద్ద ఉన్న శాఖలనే కేటాయించనున్నట్లు రేవంత్ స్పష్టం చేయడంతో.. పాత మంత్రుల శాఖల్లో మార్పు లేనట్లు స్పష్టమైంది. ప్రస్తుతం సీఎం దగ్గర హోం, మున్సిపల్, క్రీడలు, విద్యతో పాటు కీలకమైన 11 శాఖలు ఉన్నాయి. వీటిలో ఏయే శాఖలను ఎవరెవరికి కేటాయించబోతున్నారనేది సస్పెన్స్గా మారింది. ఇటీవల కొత్త మంత్రులుగా గడ్డం వివేక్ వెంకట స్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, శ్రీవారి ముదిరాజ్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.