జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమంలో సరస్వతి నది పుష్కరాలు(Saraswati Pushkaralu) వైభవంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. గురువారం తెల్లవారుజామున 5 గంటల 44 నిముషాలకు సరస్వతి ఘాట్ వద్ద శ్రీగురు మదనానంద సరస్వతి పీఠాధిపతి మాధవానంద ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలు ప్రారంభించారు.
తాజాగా తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి(CM Revanthreddy), మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తదితరులు సరస్వతీనదిలో పుష్కరస్నానం ఆచరించారు. అనంతరం హారతి ఇచ్చారు. అంతకుముందు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 10 అడుగుల సరస్వతిదేవి విగ్రహాన్ని, భక్తుల వసతి కోసం నిర్మించిన 86 గదుల సముదాయాన్ని సీఎం ప్రారంభించారు.
గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది కలిసే ఈ త్రివేణి సంగమంలో ఈ నెల 26 వరకు ఈ మహాక్రతువు జరగనుంది. బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశంతో సరస్వతి నదికి పుష్కరాలు మొదలయ్యాయి. మరోవైపు పుష్కరాలకు తెలుగు రాష్ట్రాలతో పాటూ మహారాష్ట్ర, కర్నాటక, ఛత్తీస్గఢ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక APSRTC అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. భక్తులు ఆన్ లైన్ ద్వారా సీట్లను బుక్ చేసుకోవాలని సూచించారు.