ENGINEERING COUNCILLING : విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇంజినీరింగ్ కౌన్సెలింగ్పై తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.బాలకిష్టా రెడ్డి స్పష్టతనిచ్చారు. జులై మొదటి వారంలో కౌన్సెలింగ్ ప్రారంభమై, ఆగస్టు 14వ తేదీలోపు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేసి, తరగతులను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ వార్త లక్షలాది మంది విద్యార్థులకువారి తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించింది.
ఇంజినీరింగ్ ఫీజుల ఖరారులోనూ జాప్యం :
అయితే, కొన్ని అంశాలపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఇంజినీరింగ్ కాలేజీల ఏఐసీటీఈ అఫిలియేషన్ గడువు జూన్ 30 వరకు పొడిగించడం, ఎన్ని కాలేజీలకు అనుమతి ఇచ్చారో ఇంకా స్పష్టత లేకపోవడం కౌన్సెలింగ్ ప్రక్రియపై కొంత ప్రభావం చూపనుంది. అలాగే, బీ కేటగిరీ సీట్ల అంశంపై ప్రభుత్వానికి లేఖ రాసినట్లు బాలకిష్టా రెడ్డి తెలిపారు. ఇంజినీరింగ్ ఫీజుల ఖరారులోనూ జాప్యం నెలకొంది. రాష్ట్రంలోని 157 ఇంజినీరింగ్ కాలేజీలు కొత్త ఫీజులపై ప్రతిపాదనలు పంపగా, ప్రభుత్వం అభ్యంతరం తెలపడంతో ఫీజుల ఖరారు ప్రక్రియ ఆలస్యమవుతోంది.
లీగల్ నోటీసులు జారీ :
ఈ సందిగ్ధతకు తోడు, అనధికార విద్యా సంస్థల గురించి ఉన్నత విద్యామండలి హెచ్చరించింది. నెక్స్ట్ వేవ్, బైట్ ఎక్స్ ఎల్ టెక్ ఎండ్, లీప్ స్టార్ట్, ఇంటెల్లిపాత్ అనే నాలుగు సంస్థలకు అనుమతి లేకుండా నడుపుతున్నాయని, వాటికి లీగల్ నోటీసులు జారీ చేసినట్లు ప్రొ.బాలకిష్టా రెడ్డి వెల్లడించారు. ఈ సంస్థలు డీమ్డ్ వర్సిటీలతో ఒప్పందం చేసుకున్నట్లు చెబుతూ ఇంజినీరింగ్ విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నాయని, ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని తెలిపారు
సిలబస్ మార్పులపై కసరత్తు :
విద్యార్థులకు మేలు చేసేలా సిలబస్ మార్పులపై కసరత్తు చేస్తున్నామని, కోర్సుల ఎంపికపై హెల్ప్లైన్ ఏర్పాటు చేస్తామని చైర్మన్ హామీ ఇచ్చారు. ఉన్నత విద్యామండలిలో సంస్కరణలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామాలు తెలంగాణలో ఉన్నత విద్యారంగంలో రానున్న మార్పులకు సూచికగా నిలుస్తున్నాయి.