Thursday, June 12, 2025
HomeతెలంగాణKCR: కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన కేసీఆర్

KCR: కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన కేసీఆర్

కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission) ముందు విచారణకు మాజీ సీఎం కేసీఆర్(KCR)హాజరయ్యారు. బీఆర్కే భవనంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆయనను విచారిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైన్, బ్యారేజీల నిర్మాణం, ఒప్పందాలు, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, మేడిగడ్డ కుంగిబాటు తదితర అంశాలపై విచారిస్తున్నట్లు సమాచారం. కేసీఆర్ వెంట బీఆర్ఎస్‌ నేతలు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సంతోష్ కుమార్, ప్రశాంత్ రెడ్డి, మధుసూదనాచారి, ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్, రవిచంద్ర, పద్మారావు, లక్ష్మారెడ్డి, మహమూద్ అలీని లోపలికి పోలీసులు అనుమతి ఇచ్చారు.

కాగా ఈ నెల 6న అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, 9న నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు కూడా కమిషన్ ముందు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. తాజాగా కేసీఆర్ కూడా విచారణకు హాజరు కాగా.. కమిషన్‌ అడిగే ప్రశ్నలకు కేసీఆర్ ఏం సమాధానం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సీపేజీ సమస్యలు తలెత్తిన నేపథ్యంలో గత ఏడాది మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్‌తో ఈ న్యాయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

కేసీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా బీఆర్కే భవన్ చేరుకుని ఆందోళనకు దిగారు. కేసీఆర్‌కు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. పోలీసులు వారిని అడ్డుకుంటుండటంతో అక్కడ టెన్షన్ వాతావారణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చుట్టు పక్కల పరిసరాల్లో భారీ బందోస్బు ఏర్పాటు చేశారు. దాదాపు 500 మంది పోలీసులతో బలగాలు మెహరించారు. బీఆర్కే భవన్ పరిసరాల్లో ఆంక్షలు విధించారు.

మరోవైపు కేసీఆర్ విచారణకు హాజరయ్యే మందు ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. “కేసీఆర్‌ను కమిషన్ ముందు నుంచో బెడితే నీకు పైశాచిక ఆనందం వస్తుంది కాన ఆయన ఖ్యాతి ఇసుమంత కూడా తగ్గదు. ఆయన ఎప్పటికీ తెలంగాణ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన ధీరుడే. మీరంతా సూర్యుడిని అరచేత్తో ఆపాలనుకునే మూర్ఖులే. బ్యాగులు మోసే మీకు భగీరథ ప్రయత్నాలు అర్థం కావడానికి ఎన్ని జన్మలైనా సరిపోవు. తెలంగాణ కన్నీళ్లు తుడిచిన కాళేశ్వరాన్ని అర్థం చేసుకోవడానికి మీ తెలివి సరిపోదు. ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే వాస్తవం.. తెలంగాణని తెచ్చింది కేసీఆర్ నాయకత్వం. తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం” అని రాసుకొచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News