కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) ఎదట బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR)విచారణ ముగిసింది. విచారణ అనంతరం ఆయన పార్టీ కార్యకర్తలు, నాయకులకు అభివాదం చేసి కారులో నేరుగా ఎర్రవెల్లి ఫామ్హౌస్కు వెళ్లిపోయారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రి హరీశ్ రావు ఉన్నారు.
దాదాపు 50 నిమిషాల పాటు ఆయనను కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ చంద్రఘోష్ కమిషన్ విచారించింది. అయితే తనకు జలుబుతో స్వల్ప అనారోగ్యం ఉందని.. అనారోగ్యం కారణంగా ఓపెల్ హాలులో ఫేస్ టూ ఫేస్ విచారణ కాకుండా వ్యక్తిగతంగా విచారణ చేయాలని కేసీఆర్ కోరారు. కేసీఆర్ అభ్యర్థనను అంగీకరించిన కమిషన్ ఓపెన్ కోర్టు హాలు నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మీడియాతో సహా అందరినీ బయటకు పంపి విచారణ ప్రారంభించింది.
అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు ప్రశ్నలు అడిగింది. ఇప్పటివరకు విచారించిన అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, మాజీ మంత్రులు స్టేట్మెంట్ను బేస్ చేసుకుని కేసీఆర్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. 115వ సాక్షిగా కేసీఆర్ను కమిషన్ విచారించింది. ఈ సందర్భంగా కాళేశ్వరంతో పాటు అనుబంధ ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించి పలు డాక్యుమెంట్లు పీసీ ఘోష్ కమిషన చైర్మన్ పీ చంద్రఘోష్కు కేసీఆర్ అందజేశారు.
కాగా ఈ నెల 6న అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, 9న నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు కూడా కమిషన్ ముందు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. తాజాగా కేసీఆర్ ను కూడా విచారించింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సీపేజీ సమస్యలు తలెత్తిన నేపథ్యంలో గత ఏడాది మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్తో ఈ న్యాయ విచారణ కమిషన్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.