Sunday, November 16, 2025
HomeతెలంగాణClassrooms to Paddy Fields: అక్షర సేద్యం... చదువుల గుడిలో సిరుల పంట!

Classrooms to Paddy Fields: అక్షర సేద్యం… చదువుల గుడిలో సిరుల పంట!

Gurukul school students in organic farming  : వ్యవసాయం దండగని అనుభవజ్ఞులైన రైతన్నలే పొలాలకు దూరమవుతున్న కాలమిది. అలాంటిది, పట్టుమని పద్దెనిమిదేళ్లు నిండని బాలికలు “మేము సైతం” అంటూ పొలం బాట పట్టి పసిడి పంటలు పండిస్తున్నారు. కేవలం కూరగాయలే కాదు, ఏకంగా వరి పండించి అందరినీ అబ్బురపరుస్తున్నారు. అసలు వీళ్లంతా ఎవరు..? ఈ హరిత విప్లవం ఎక్కడ ఆవిష్కృతమైంది..? చదువులకే పరిమితం కావాల్సిన ఈ చిన్నారుల చేతికి మట్టి ఎలా అంటింది..? తెలుసుకుందాం పదండి.

- Advertisement -

ఈ అద్భుతానికి వేదిక నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలోని తెలంగాణ బాలికల గురుకుల పాఠశాల. ఇక్కడి విద్యార్థినులు చదువుల్లోనే కాదు, వ్యవసాయంలోనూ తమ ప్రతిభను చాటుతూ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఆ ఆలోచనే ఓ అంకురార్పణ: పాఠశాల మరియు వసతిగృహం చుట్టూ ఉన్న ఖాళీ స్థలాన్ని చూసి ఆ విద్యార్థినులకు ఓ చక్కని ఆలోచన తట్టింది. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఆ ఖాళీ నేలను సాగు భూమిగా మార్చారు.

తొలి అడుగు: మొదటగా తోటకూర, గోంగూర, మునగ, సొరకాయ వంటి కూరగాయలు, ఆకుకూరలను పండించడం ప్రారంభించారు.
పక్కా ప్రణాళిక: తాము పండించిన పంటలు, వాటిని ఏ రోజు వంటల్లో ఉపయోగించారనే వివరాలను సైతం పక్కాగా రికార్డులలో నమోదు చేసుకుంటూ తమ ప్రయోగాన్ని విజయవంతం చేసుకున్నారు.

అర ఎకరం… అత్మవిశ్వాసం : కూర గాయల సాగులో వచ్చిన విజయం వారిలో నూతనోత్సాహాన్ని నింపింది. ఈసారి మరింత పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.

వరి సాగు: పాఠశాల ఆవరణలోని అర ఎకరం పొలాన్ని ఎంచుకుని వరి సాగుకు సిద్ధమయ్యారు. రైతు కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థినులు కావడంతో వారికి వ్యవసాయ పనులపై ఉన్న అవగాహన ఎంతగానో కలిసొచ్చింది.

సమిష్టి కృషి: విద్యార్థినుల ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారికి అండగా నిలిచారు. కొందరు నారును సమకూర్చగా, ఓ విద్యార్థిని తండ్రి స్వయంగా ముందుకు వచ్చి ట్రాక్టర్‌తో దుక్కి దున్ని సహాయపడ్డారు. ఆ తర్వాత విద్యార్థినులందరూ కలిసి ఆడిపాడుతూ వరి నాట్లు వేశారు.

సేంద్రియ సిరులు… చీడపీడలకు చెక్: ఈ బాలికల వ్యవసాయ పద్ధతి మరింత ప్రత్యేకం. పూర్తిగా సేంద్రియ పద్ధతులను అనుసరిస్తూ పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.

సొంత ఎరువు: వసతిగృహంలో మిగిలిపోయిన ఆహార పదార్థాలు, ఆకులను పోగుచేసి, ఉపాధ్యాయులు మరియు స్థానిక రైతుల సూచనలతో సొంతంగా సేంద్రియ ఎరువును తయారు చేసుకుంటున్నారు.

సరికొత్త పద్ధతి: రసాయనాలకు తావివ్వకుండా, వరి పంటకు తెగుళ్లు సోకకుండా పొలం చుట్టూ బంతిపూల మొక్కలను నాటి సహజ పద్ధతిలో చీడపీడలను నివారిస్తున్నారు.

భవిష్యత్తుపై భరోసా:  ప్రస్తుతం వరి పంట ఏపుగా పెరిగి కనువిందు చేస్తోంది. ఈ విజయం వారిలో భవిష్యత్ ప్రణాళికలకు ఊతమిచ్చింది. వచ్చే పంటకాలం నాటికి చిరుధాన్యాలను కూడా సాగు చేయాలని సంకల్పించారు. విశేషమేమిటంటే, ఈ గురుకుల పాఠశాల ప్రతిష్టాత్మకమైన ‘పీఎం శ్రీ (ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా)’ పథకానికి కూడా ఎంపికైంది.

ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న 645 మంది విద్యార్థులలో, 9, 10, ఇంటర్ తరగతులకు చెందిన 158 మంది విద్యార్థినులు రోజూ గంట పాటు ఈ వ్యవసాయ పనులలో ఉత్సాహంగా పాల్గొంటూ, అక్షరాలతో పాటు మట్టితోనూ స్నేహం చేస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad