Tuesday, September 17, 2024
HomeతెలంగాణGutha: అర్జీల సమితి, విశేషాధికారాల కమిటీ ప్రారంభం

Gutha: అర్జీల సమితి, విశేషాధికారాల కమిటీ ప్రారంభం

తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలోని కమిటీ హాల్ లో శాసన మండలి అర్జీల సమితిని ,అలాగే విశేషా అధికారముల కమిటీని ప్రారంభోత్సవం చేశారు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. శాసన మండలి అర్జీల కమిటీ,పివిలేజ్ కమిటీ ఛైర్మన్ గా నియమితులైన డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, శాసన మండలి అర్జీల కమిటీ, ప్రివిలేజ్ కమిటీ సభ్యులకు ఈ సందర్భంగా చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ..

- Advertisement -

👉రాష్ట్ర శాసన పరిషత్తు సమావేశాల సందర్భంగా అనేక రకాల సమస్యలు ప్రస్థావనకు వస్తుంటాయి. ఏదైనా సందర్భంలో ప్రభుత్వ దృష్టికి రాని ప్రజా సమస్యలను గౌరవ సభ్యులు ఆర్జీల రూపంలో, శాసన పరిషత్తుకు సమర్పిస్తారు. కాబట్టి ఈ కమిటీకి అత్యంత ప్రాధాన్యత ఉంది.

👉కమిటీకి సిఫార్సు చేసిన అర్జీలని పరిశీలించి, సంబంధిత అధికారులతో చర్చించి, ప్రజలకు న్యాయం చేసే విధంగా కమిటీ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. తద్వారా ప్రజలకు ఎంతో మేలు చేసిన వాళ్ళమౌతాము.

👉ఈ సమితికి ఉన్న ప్రాధాన్యతా దృష్ట్యా సభ్యులంతా క్రమం తప్పకుండా. సమావేశాలకు హాజరై, గౌరవ సభ్యుల ద్వారా సభకు సమర్పించే అర్జీలు త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకుని శాసన పరిషత్తు యొక్క గౌరవాన్ని పెంచుతారని ఆశిస్తున్నాను అలాగే ప్రివిలేజ్ కమిటీ లో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ..

👉గౌరవ సభ్యులకు కొన్ని విశేషమైన అధికారాలు, హక్కులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 194 ప్రకారం ఇవ్వబడ్డాయి. వాటికి భంగం కలిగినట్లైతే, వాటిని పరిశీలించి చర్యలు తీసుకోవడానికి విశేషాధికారముల కమిటీకి సర్వాధికారాలు ఉంటాయి.

👉శాసన పరిషత్తు సభ్యుల గౌరవాన్ని, హక్కులను కాపాడే ఉద్దేశ్యంతోనే విశేషాధికారముల కమిటీ ఏర్పాటైనందున, సభ్యుల విశేషాధికారములకు ఏమైన భంగం వాటిల్లినట్లైతే వాటికి సంబంధించిన అంశాల్ని కమిటీ అధ్యక్షులు లేదా తన దృష్టికి తెచ్చినట్లైతే వాటిని కమిటీకి రెఫర్ చేయడం జరుగుతుందనీ, కమిటీ ఆయా అంశాలపై క్షుణ్ణంగా చర్చించేందుకు అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకొని, చర్చించి తగు చర్యలు తీసుకుంటాం.

👉గౌరవ సభ్యుడు తన హక్కులకు భంగం వాటిల్లిందని భావించిన సందర్భంలో కమిటీ ముందుకు తప్పనిసరిగా రావాలనీ, వచ్చి వాటిని పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.

👉సభ్యులు జిల్లాల్లో పర్యటించే సందర్భంలో సభ్యులకు సంబంధించిన ప్రొటోకాల్ వ్యవహారాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉంటుందనీ, ప్రభుత్వం నుండి వచ్చిన ప్రొటోకాల్ నిబంధనలను వారు తూచా తప్పకుండా పాటించాల్సిందే అని ఆయన తెలిపారు. ఏదైనా సందర్భంలో ప్రొటోకాల్ వాయిలేషన్ జరిగినప్పుడు, అధికారులు కావాలనే ఆ విధంగా చేస్తున్నారన్న భావన గౌరవ సభ్యుల్లో ఏర్పడుతున్న దృష్ట్యా,

👉అటువంటి వాటికి ఆస్కారం ఇవ్వకుండా అధికారులు సభ్యుల గౌరవ మర్యాదలకు మరియు వారి హక్కులకు సంబంధించిన అంశాల పట్ల ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకొని పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాను.

ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, ఫరూక్ హుస్సేన్, సిరికొండ మధుసూదన చారి, శేరి శుభాష్ రెడ్డి, యాదవ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, తెలంగాణ లెజిస్లేచర్ సెక్రెటరీ డా నరసింహా చార్యులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News