జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర క్షేత్రం ఉన్న త్రివేణి సంగమంలో సరస్వతి నది పుష్కరాలు(Saraswati Pushkaralu)ముగిసిన సంగతి తెలిసిందే. ఈనెల 15న ప్రారంభమైన పుష్కరాలు 26వ తేదీతో ముగిశాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు త్రివేణి సంగమంలో పుష్కర స్నానాలు ఆచరించారు. పుష్కరాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.35 కోట్లు కేటాయించింది. 12 రోజుల పాటు జరిగిన పుష్కరాలకు పుణ్యస్నానం ఆచరించేందుకు తెలంగాణ నుంచే కాకుండా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి 30 లక్షల మంది దాకా భక్తులు తరలివచ్చారు. దీంతో కాళేశ్వరం హుండీకి భారీగా ఆదాయం వచ్చింది.
పుష్కరాల వేళ ప్రతి రోజు వేలాది మంది భక్తులు కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. స్వామి వారికి భారీగా కానుకలు సమర్పించుకున్నారు. పుష్కరాలు ముగిసిన సందర్భంగా కాళేశ్వరం ఆలయంలోని హుండీని లెక్కించారు. వరంగల్ సహాయ కమిషనర్ సమక్షంలో హుండీ లెక్కింపు జరిగింది. మొత్తం 12 రోజులతో పాటుగా అంతకు ముందు రెండు నెలలకు గాను కాళేశ్వరం ఆలయానికి రూ.2.83 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. డబ్బుతో పాటు బంగారం 15 గ్రాములు, 750 గ్రాముల వెండి కూడా వచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే పుష్కరాల వేళ తెలంగాణ ఆర్టీసీకి కూడా సుమారు రూ.8 కోట్ల ఆదాయం లభించింది.