Wednesday, September 25, 2024
HomeతెలంగాణGauravelli: మెట్ట ప్రాంత రైతుల కలల సౌధం "గౌరవెల్లి"ఫలించిన వేళ

Gauravelli: మెట్ట ప్రాంత రైతుల కలల సౌధం “గౌరవెల్లి”ఫలించిన వేళ

బీడు భూముల చెంతకు గంగమ్మ

హుస్నాబాద్ అంటేనే మొదట గుర్తుకు వచ్చేది గౌరవెల్లి ప్రాజెక్టు. ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంఖుస్థాపన చేసారు. కానీ నాటి ప్రభుత్వంలో పనులు మాత్రం ముందుకు కదలలేదు. అప్పుడున్న ప్రజాప్రతినిధులు ఈ విషయమై ఎలాంటి చొరవ తీసుకోలేకపోయారు. ప్రవీణ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తట్ట మట్టిని కూడా తీయలేకపోయారనే విమర్శలున్నాయి. అప్పుడు డిజైన్ చేసిన ప్రకారం దాని సామర్థ్యం తక్కువే.. కానీ టీఆరెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు డిజైన్ అభివృద్ధి చేసి.. 8-23 టీఎంసీలకు పెంచారు. నిర్వాసితులకు ఎక్కడ చెల్లించని విధంగా నష్టపరిహారం చెల్లించారు. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించే విషయంలో ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ చూపిన చొరవ మరువలేనిది. నిర్వాసితులకు నష్టపరిహారం ప్రభుత్వం ద్వారా అందించేందుకు అయన అనుక్షణం పరితపించారు. కొత్తగా ఏర్పాటైన నిర్వాసితుల కాలనీలో సౌకర్యాల కల్పనకు కృషి చేసారు.

- Advertisement -

ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. సాగునీరు మిడ్ మానేరు నుండి తోటపల్లి స్టోరేజ్ రిజర్వాయర్ కు అక్కడి నుండి సొరంగ మార్గం ద్వారా పంపింగ్ ద్వారా గౌరవెల్లికి చేరుతాయి. ఇందుకు సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి. గౌరవెల్లి మోటార్ల ట్రయల్ రన్ కూడా విజయవంతంగా పూర్తయి, గత వారం రోజుల నుండి గోదావరి జలాలతో గౌరవెల్లి ప్రాజెక్టులోకి నీటితో నింపడం జరుగుతుంది. మెట్ట ప్రాంత రైతుల కలల సౌధం.. చిరకాల స్వప్నం నెరవేరింది. రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. నిజానికి ఈ ప్రాజెక్టును ప్రతిపక్షాలు అడ్డుకోవాలని చూశాయి. నిర్వాసితులను రెచ్చగొట్టి కేసులు వేయించారు. కానీ హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ చొరవ తీసుకుని ప్రశాంత వాతావరణంలో ప్రభుత్వంతో అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ.. ప్రాజెక్టు నిర్మాణం ముందుకు తీసుకుపోయేందుకు కృషి చేసారు. ప్రాజెక్టు అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ఎన్నో ఆటంకాలు సృష్టించినా.. ఎమ్మెల్యే అన్ని అడ్డంకులు అధిగమిస్తూ ముందుకు వెళ్లారు. ఈ ప్రాజెక్టు ద్వారా హుస్నాబాద్ కు పర్యాటక కళ రావడంతో పాటు… ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరగనున్నాయి. తాగు, సాగునీటి కష్టాలు శాశ్వతంగా తీరనున్నాయి. గోదావరి జలాలు మెట్ట ప్రాంత పంటపొలాలకు, బీడు భూములకు చేరనున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు లక్ష ఎకరాలకు సాగునీరు అందనుంది. సుమారు రూ. 2100 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం జరిగింది.

హుస్నాబాద్ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయి. అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోంది. ప్రస్తుతం సిద్ధిపేట – ఎల్కతుర్తి ప్రధాన రహదారి నేషనల్ హైవేగా మారుతోంది. రోడ్డు నిర్మాణం పనులు శర వేగంగా జరుగుతున్నాయి. కరీంనగర్ నుండి హుస్నాబాద్ మీదుగా జనగాం వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానానికి కూడా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసారు. హుస్నాబాద్ ప్రస్తుతం.. హనుమకొండ, జనగాం, సిద్ధిపేట, కరీంనగర్ జిల్లాలకు ముఖ్య కూడలిగా మారుతోంది. ఇక్కడి భూముల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. మిడ్ మానేరు ద్వారా జలాలు చిగురుమామిడి, సైదాపూర్ మండలాలకు అందుతున్నాయి. దేవాదుల ద్వారా ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలకు సాగునీరు అందుతోంది. గతంలో కాకతీయ ప్రధాన కాలువ ద్వారా.. ఎప్పుడు సాగునీరు వస్తుందో.. ఎప్పుడు రాదో తెలిసేది కాదు. కానీ.. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత… కాకతీయ కాలువ నిత్యం ప్రవహిస్తోంది.

ఎల్కతుర్తి మండలం మొత్తం.. కాకతీయ కింద సాగు అవుతోంది. గతంలో చెరువులు అధ్వాన్నంగా ఉండేవి. సర్కారు తుమ్మలతో. తూములు శిధిలమై కనిపించేవి.. మిషన్ కాకతీయ ద్వారా.. చెరువుల మరమ్మతులు జరగడంతో.. మండు వేసవి లో కూడా చెరువుల్లో నీళ్లు కనిపిస్తున్నాయి. ఒక ప్రాంతం, నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే.. స్థిరమైన, సమర్థవంతమైన నాయకత్వం కావాలని, అది ఉన్నందువల్లే.. గడచినా 9 ఏళ్లలో అంతకుముందెన్నడు లేని విధమైన అభివృద్ధిని హుస్నాబాద్ నియోజకవర్గం సాధించింది. ఏదిఏమైనా ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ నాయకత్వంలో హుస్నాబాద్ అభివృద్ధి పరుగులు పెడుతోంది. హుస్నాబాద్ ముఖ చిత్రం, ఇక్కడి ప్రజల జీవన శైలి గడచిన పదేళ్లలో పూర్తిగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News