తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్లో జాగృతి నూతన కార్యాలయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకంతో పాటు, జాగృతి జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ దృఢమైన నాయకత్వం, రాజకీయ దార్శనికత వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాకారమైందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది తల్లులు తమ బిడ్డలను కోల్పోయారని.. వారి పోరాటాలు, త్యాగాలతో కూడిన ఈ చారిత్రక ఘట్టంలో పాలుపంచుకున్న జాగృతి కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం ‘జై తెలంగాణ’ అని కూడా పలకలేని దుస్థితిలో ఉండటం అత్యంత దారుణమని మండిపడ్డారు. ఇది అమరవీరులకు జరుగుతున్న అన్యాయంగానే భావిస్తున్నామన్నారు. అమరవీరులకు సీఎం నివాళులు అర్పించేంత వరకు తెలంగాణ జాగృతి తరఫున ప్రత్యేక కార్యాచరణ చేపట్టి పోరాటం చేస్తామన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడటంలో జాగృతి ఎప్పుడూ ముందుంటుందని కవిత వెల్లడించారు.
