తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, BRS పార్టీపై సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా విజవోత్సవ సభలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ అప్పటి ఏపీ ప్రభుత్వానికి బనకచర్ల ప్రాజెక్టు ఐడియా ఇచ్చి తెలంగాణ రైతుల గొంతును కోశారని మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం తెలంగాణ ప్రజలను గోదావరి నీళ్ల పరంగా, ఆర్థికపరంగా ముంచేశారని పేర్కొన్నారు. రైతే ఈ రాష్ట్రానికి పునాది, వారికి ప్రాధాన్యత ఇవ్వడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ అన్నారు. 70 లక్షల మంది రైతులు పండుగలా తమ జీవితాన్ని గడుపుతున్నారన్నది ప్రజాప్రభుత్వ విజయానికి నిదర్శనమని చెప్పారు. రైతుల కోసం గత 18 నెలల్లో రూ.1.04 లక్షల కోట్ల మేర ఖర్చు చేసి, పది ఏళ్లలో సాధించని ప్రయోజనాలను ఒక్క సంవత్సరంలోనే అందించగలిగామని తెలిపారు.
పాత పాలనలో వరి పండిస్తే ఉరి వేసుకున్నట్లే అని అన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ప్రతి గింజను మద్దతుదరతో కొనుగోలు చేసి, రూ.500 బోనస్తో రైతులకు గౌరవాన్ని ఇచ్చిందని చెప్పారు. ఈ చర్యల ఫలితంగా దేశంలోనే అత్యధికంగా ధాన్యం ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తెలంగాణ నిలబడిందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల రూపాయలు వృథా చేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన రేవంత్, అది “కూలేశ్వరంగా” మారిందని వ్యాఖ్యానించారు. ఇతర సాగునీటి ప్రాజెక్టులైన భీమా, నెట్టెంపాడు, సీతారామ, దేవాదుల వంటి ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాలేదో వివరంగా ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుపై తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా వ్యవహరించారన్న కేసీఆర్ ఆరోపణలను ఖండించిన రేవంత్, గోదావరి జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిన వారెవరో శాసనసభ వేదికగా చర్చిద్దామని సవాల్ విసిరారు. చిత్తశుద్ధి ఉంటే స్పీకర్కి లేఖ రాసి, చర్చకు ముందుకు రావాలని సూచించారు. “పదేళ్ల పాలనలో ఎంత పనిచేశారో ప్రజలు గమనిస్తున్నారని, మేము 18 నెలల్లో చేసిన మార్పులను కూడా చూసుకుంటున్నారు,” అంటూ తామే రైతులకు రక్షణ కవచంగా నిలుస్తున్నామని స్పష్టం చేశారు. రైతుకు గౌరవం, యువతకు ఉద్యోగం, మహిళలకు ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా తమ పాలన ముందుకు సాగుతుందని చెప్పారు.