KCR: కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. ఇవాళ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యేందుకు మాజీ సీఎం కేసీఆర్(KCR) ఎర్రవెల్లి ఫాంహౌస్ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. కాసేపట్లో బీఆర్కే భవన్ లో విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 11:30 గంటలకు ఈ విచారణ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గులాబీ శ్రేణులు భారీగా తెలంగాణ భవన్ చేరుకున్నారు.
ఇక విచారణకు బయలుదేరే ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దంపతులు ఫాంహౌస్లో కేసీఆర్ను కలవడం గమనార్హం. మరోవైపు కేసీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్కే భవన్ వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. ఉద్యోగులు, సిబ్బందిని మాత్రమే లోపలకు అనుమతిస్తున్నారు. మిగతా వారిని గేట్ బయటే నిలిపివేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కేసీఆర్కు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. పోలీసులు వారిని అడ్డుకుంటుండటంతో అక్కడ టెన్షన్ వాతావారణం నెలకొంది.
ఇదిలా ఉంటే.. ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విమర్శలు గుప్పిస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.“కేసీఆర్ను కమిషన్ ముందు నుంచో బెడితే నీకు పైశాచిక ఆనందం వస్తుంది కాన ఆయన ఖ్యాతి ఇసుమంత కూడా తగ్గదు. ఆయన ఎప్పటికీ తెలంగాణ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన ధీరుడే. మీరంతా సూర్యుడిని అరచేత్తో ఆపాలనుకునే మూర్ఖులే. బ్యాగులు మోసే మీకు భగీరథ ప్రయత్నాలు అర్థం కావడానికి ఎన్ని జన్మలైనా సరిపోవు. తెలంగాణ కన్నీళ్లు తుడిచిన కాళేశ్వరాన్ని అర్థం చేసుకోవడానికి మీ తెలివి సరిపోదు. ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే వాస్తవం.. తెలంగాణని తెచ్చింది కేసీఆర్ నాయకత్వం. తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం” అని రాసుకొచ్చారు.
“60 ఏళ్లుగా సాధ్యం కాని అద్భుతాన్ని కేసీఆర్ సాధించారు. కేసీఆర్ తెలంగాణ కోసం స్వచ్ఛమైన ఉత్సాహంతో ఒక ప్రజాస్వామ్య ప్రచారాన్ని నడిపించారని.. ఆయన నాయకత్వంలో మిలియన్ల మంది ప్రజల కల అయిన ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు. కాళేశ్వరం ద్వారా తెలంగాణ దాహాన్ని తీర్చారు. జై కేసీఆర్.. జై తెలంగాణ” అంటూ తెలిపారు.