Friday, September 20, 2024
HomeతెలంగాణKhammam: దశాబ్ది ఉత్సవాలు ఘనంగా చేయాలి

Khammam: దశాబ్ది ఉత్సవాలు ఘనంగా చేయాలి

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఐడిఓసిలోని సమావేశ మందిరంలో అధికారులతో దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై మంత్రి సమీక్షించి, దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఖమ్మం జిల్లాకు ఘనమైన కీర్తి ఉందని, పరిపాలన అద్భుతంగా సాగుతుందని, అనేక విజయాలను సాధించామని, ఇది అధికారుల కృషితో సాధ్యమైనదని అన్నారు. ఆరోజు తెలంగాణ సాధనలో ఉద్యోగులు సకలజనుల సమ్మెతో తెలంగాణ ఆకాంక్షను రగిల్చారని, సాధించిన తెలంగాణలో అభివృద్ధికి అదే ఆకాంక్షతో ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తున్నారని అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను విజయవంతం చేసే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని, ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసి, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకొని విజయవంతం చేయాలని మంత్రి తెలిపారు. ఉత్సవాలను 21 రోజల పాటు నిర్వహించనున్నట్లు ఆయన అన్నారు. జూన్ 2న అమరవీరులకు నివాళులర్పించి, ఐడిఓసి లో పతాకావిష్కరణ ఉంటుందని, సాయంత్రం లకారంలో సాంస్కృతిక కార్యక్రమాలు వుంటాయని ఆయన అన్నారు.

- Advertisement -

జూన్ 3న రైతుల దినోత్సవం పురస్కరించుకుని జిల్లాలోని 129 రైతు వేదికల్లో పెద్ద ఎత్తున రైతులతో సమావేశం ఏర్పాటు చేయాలని అన్నారు. రైతు వేదిక క్లస్టర్ పరిధిలోని గ్రామాల రైతులు ఎడ్ల బండ్లలో, ట్రాక్టర్లలో, ద్విచక్రవాహనాలపై ఊరేగింపుగా రైతు వేదికకు తరలివచ్చేలా ఏర్పాట్లు చేయాలని, రైతులకు ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు, రైతుభీమా, ఉచిత విద్యుత్ తదితరాలపై ప్రభుత్వం ఎంత ఖర్చుచేస్తున్నది, పథకాలకు పూర్వం పరిస్థితి, ఇప్పటి పరిస్థితి పై అవగాహన కల్పించాలన్నారు. రైతు బీమా పొందిన కుటుంబంతో వారు పొందిన లబ్దిని వారితోనే చెప్పించాలన్నారు. ముందస్తు సాగు, పంటల మార్పిడిపై రైతులకు ప్రయోజనాలను వివరించాలన్నారు. జూన్ 4న సురక్షా దినోత్సవం జరపాలని, ప్రజలకు షీ టీమ్స్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని, ర్యాలీలు చేపట్టాలని, మంచి పౌరులు, విశిష్ట సేవలందించిన పోలీసులను సత్కరించాలని అన్నారు. జూన్ 5న విద్యుత్ దినోత్సవం పురస్కరించుకుని సబ్ స్టేషన్లు, విద్యుత్ కార్యాలయాలు అలంకరించాలని, తెలంగాణ కు పూర్వం రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి, ఇప్పుడు పరిస్థితిపై, విద్యుత్ రంగంలో ఆదర్శంగా నిలిచిన విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. జూన్ 6న పారిశ్రామిక ఉత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్థాయిలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి పారిశ్రామిక రంగంలో సాధించిన ప్రగతిని తెలియజేయాలన్నారు. జూన్ 7న సాగునీటి దినోత్సవాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు చేపట్టి, సాగునీటి రంగంలో రాష్ట్రం ఏర్పడ్డాక సాధించిన ప్రగతిని ప్రజల ముందు ఉంచాలన్నారు.

జూన్ 8న చెరువుల పండుగను పురస్కరించుకుని గ్రామ గ్రామాన చెరువుల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని, కట్టలపై భోజనాలు ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు. జూన్ 9న తెలంగాణ సంక్షేమ సంబరాలను పురస్కరించుకుని రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభోత్సవం ఉంటుందని, సాంఘీక సంక్షేమ శాఖ చే సేకరించిన 58 ఎకరాలను భూమిని, ఇండ్లులేని 3000 వేల మందికి పట్టాల పంపిణీ చేయనున్నట్లు, బిసి సంక్షేమ శాఖ ద్వారా బిసిలకు చెక్కుల పంపిణీ, కళ్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్ల తదితర లబ్ధిదారులకు అందజేయనున్నట్లు ఆయన అన్నారు. జూన్ 10న సుపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రొత్తగా ఏర్పాటైన మునిసిపాలిటీలు, మండలాలు, గ్రామాల దగ్గర సంబరాలు చేపట్టాలని, క్రొత్తగా ఏర్పాటుతో కల్గిన ప్రయోజనాలను కరపత్రాల రూపంలో ప్రచురించి ప్రజలకు వివరించాలని అన్నారు. జూన్ 11న సాహిత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భక్త రామదాసు క్షళాక్షేత్రంలో కవి సమ్మేళనం, కవితల పోటీలను నిర్వహించాలని మంత్రి తెలిపారు. జూన్ 12న పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రన్ ను చేపట్టాలని ఆయన అన్నారు. జూన్ 13న మహిళా సంక్షేమ దినోత్సవం పురస్కరించుకుని మహిళా ఉద్యోగినులకు సన్మానం చేయాలని, మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం చే అమలవుతున్న పథకాలపై అవగాహన కల్పించాలని అన్నారు.

జూన్ 14న వైద్య, ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్య రంగంలో ఆనాటి సౌకర్యాలు, ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కల్పిస్తున్న సౌకర్యాల గురించి, పల్లె, బస్తీ దవాఖానాలు, ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు, ఆరోగ్య మహిళ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. జూన్ 15న పల్లెప్రగతి దినోత్సవం పురస్కరించుకుని గ్రామాల్లో సౌకర్యాల కల్పన పై ప్రజలకు వివరించాలని, నూతన పంచాయితీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఉత్తమ సర్పంచులు, ఎంపీపీ లకు సన్మానాలు చేయాలని మంత్రి తెలిపారు. జూన్ 16న తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం పురస్కరించుకుని మునిసిపల్ కార్పొరేషన్, మునిసిపాలిటీల్లో 9 సంవత్సరాల ప్రగతిని ప్రజలకు వివరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. జూన్ 17న గిరిజనోత్సవం పురస్కరించుకుని గిరిజన గ్రామాల్లో 10 శాతం రిజర్వేషన్లు, గిరివికాసం తో లబ్దిపై అవగాహన కల్పించాలన్నారు. జూన్ 18న మంచినీళ్ళ పండుగను ఘనంగా చేపట్టాలని, త్రాగునీటి విజయాలపై సభలు నిర్వహించాలని అన్నారు. జూన్ 19న హరితోత్సవం పురస్కరించుకుని పెద్ద ఎత్తున మొక్కలు నాటుటకు ఏర్పాటు చేయాలని అన్నారు. జూన్ 20న తెలంగాణ విద్యా దినోత్సవం పురస్కరించుకుని మన ఊరు-మన బడి కార్యక్రమ పనులు పూర్తితో పాఠశాలల పునః ప్రారంభ కార్యక్రమాలు చేయాలని, పిల్లలకు యూనిఫామ్, పుస్తకాల పంపిణీ చేయాలని అన్నారు. వ్యాసరచన, ఉపన్యాసాలు, చిత్రలేఖనం తదితర పోటీలు నిర్వహించాలన్నారు. జూన్ 21న ఆధ్యాత్మిక దినోత్సవం పురస్కరించుకొని, ఆలయాలు, మసీదులు, చర్చీలు అలంకరించాలని, ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేపట్టాలని అన్నారు.

జూన్ 22న అమరులకు నివాళులు, స్మారక చిహ్నాల ప్రారంభోత్సవం చేయాలని అన్నారు. గ్రామ, మండల, మునిసిపల్, జిల్లా పరిషత్ స్థాయిల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, అమరులకు నివాళి తీర్మానం, 2 నిమిషాల మౌనం పాటించాలని, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 2 నిమిషాలు మౌనం పాటించాలని మంత్రి అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఉత్సవాలు వైభవోపేతంగా చేపట్టాలని మంత్రి తెలిపారు. సమావేశంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ, 21 రోజులు ఉత్సవాలు ఘనంగా చేపట్టాలన్నారు. ఉద్యమ సమయంలో ఘట్టాలను ప్రధాన కూడళ్ళలో ప్రదర్శించాలని, 2014 కు పూర్వం, 2014 తర్వాత సాధించిన ప్రగతిని ప్రజలకు తెలియజేయాలని అన్నారు. తొమ్మిదేండ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను ప్రజల్లోకి తెలపాలన్నారు. సమావేశంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ, క్షేత్ర స్థాయిలో అధికారులతో సమావేశమై వేడుకలు పెద్దఎత్తున ఘనంగా చేపట్టుటకు కార్యాచరణ చేసినట్లు తెలిపారు. తెలంగాణ సాధనకు చేపట్టిన స్పూర్తిని, సాధించిన తెలంగాణ అభివృద్ధిని ప్రజలకు వివరించాలని, వేడుకలను గొప్పగా జరుపుకోవాలని అన్నారు.

జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, అధికారులకు వేడుకల నిర్వహణపై అవగాహన కల్పించినట్లు, సమన్వయం తో వేడుకలను విజయవంతం చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకట శేషగిరిరావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, శిక్షణా సహాయ కలెక్టర్లు రాధిక గుప్తా, మయాంక్ సింగ్, జిల్లా రైతుబంధు సమితి కన్వీనర్ ఎన్. వెంకటేశ్వర రావు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News