తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ ముందు వరుసలో ఉంటారు. వారికి పార్టీ అధిష్టానం ఏ బాధ్యత అప్పగించినా విజయవంతంగా నిర్వహిస్తారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 12 నియోజకవర్గాలకు గాను 11 నియోజకవర్గాలు గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే 2024లో జరిగిన ఎంపీ ఎన్నికల్లోనూ నల్గొండ జిల్లా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడంలో సత్తా చాటారు. ఇప్పటికే కోమటిరెడ్డి వెంటకరెడ్డి మంత్రివర్గంలో చోటు సంపాదించుకోగా.. మంత్రివర్గ విస్తరణలో రాజగోపాల్ రెడ్డి(Komatireddy RajGopal Reddy) మంత్రి పదవి వస్తుందని ఆశించారు. అయితే సామాజిక సమీకరణల నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కకుండా పోయింది. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఆయనను పార్టీ పెద్దలు ఇంటికి వెళ్లి బుజ్జగించారు.
ఈ క్రమంలోనే రాజగోపాల్ రెడ్డి ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. “తెలంగాణ కేబినెట్లో నూతనంగా నియమితులైన మంత్రులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ప్రజలకు సేవ చేయడంలో వారికి సంపూర్ణ విజయం కోరుకుంటున్నాను. నాకు రాజకీయాలు అంటే పదవులు గానీ, అధికారాలు గానీ కాదు. ప్రజల పట్ల నా నిబద్ధత, తెలంగాణ పునర్నిర్మాణం పట్ల నా కలలే నాకు ప్రేరణగా నిలిచాయి. అదే కారణంగా నేనే తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చాను.
ఈరోజు నేను మంత్రిగా లేకపోయినా, పార్టీని బలపరిచే ప్రయత్నాల్లో, ప్రజల మద్దతుతో ముందుకు సాగుతాను. ప్రజల సమస్యలు వినడంలో, వారి హక్కుల కోసం పోరాడడంలో, వారి గొంతుకను ప్రభుత్వం వరకు తీసుకెళ్లడంలో నేను ఎప్పటికీ ముందుంటాను. నా రాజకీయ ప్రయాణం ఇక్కడితో ఆగదు. కొన్నిసార్లు, పదవి లేకుండానే ప్రజల మధ్య పనిచేసే అవకాశం ఎంతో శక్తివంతంగా మారుతుంది. అదే మార్గాన్ని నేను ఎంచుకున్నాను.” అని స్పష్టం చేశారు.