KTR Visits Harish Rao at Hospital: మాజీ మంత్రి, సిద్ధిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సోమవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను బేగంపేటలోని కిమ్స్ సన్ షైన్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసుపత్రికి చేరుకుని హరీశ్ రావును పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు కేటీఆర్ సూచించారు. కాగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని.. తగ్గిన వెంటనే హరీశ్ రావను డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు.
ఫార్ములా ఈ రేసింగ్ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారుల ఎదుట కేటీఆర్ విచారణకు హాజరైన విషయం విధితమే. దాదాపు 8 గంటల పాటు ఆయనను విచారించారు. విచారణ అనంతరం తెలంగాణ భవన్ లో కేటీఆర్, హరీశ్ రావు, ఇతర కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. అప్పటికే హరీశ్ రావు జ్వరంతో బాధపడుతున్నారు. మీడియాతో మాట్లాడే సమయంలో ఎక్కువసేపు నిలబడే ఉండంటో మరింత అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు.
ఇక ఈ మీడియా సమావేశంలో హరీశ్ రావు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూనే కేటీఆర్ పై ప్రశంసలు కురిపించారు. రేవంత్ రెడ్డి చేతకానితనం కప్పిపుచ్చుకోవడానికే కేటీఆర్ పై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. కేటీఆర్ అంటే ఓ వ్యక్తి కాదని శక్తి అన్నారు. కాంగ్రెస్ పాలనలో తాము దగ్గినా, తుమ్మినా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా తలవంచే వ్యక్తి కేటీఆర్ కాదని తెలంగాణ మొత్తం తన వెనుక నిలబడ్డ మహాశక్తి అని తెలిపారు. లక్షలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు అండగా ఉన్నారని.. కేటీఆర్ ను ముట్టుకున్నవారు భస్మమవుతారని హెచ్చరించారు.