బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. బీజేపీతో బీఆర్ఎస్ విలీనానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కవిత చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆమె వ్యాఖ్యలను కమలం నేతలు ఖండిస్తుంటే.. కాంగ్రెస్ నేతలు నిజమని చెబుతున్నారు. తాజాగా టీపీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్పై(Eatala Rajendar) సంచలన ఆరోపణలు చేశారు. షామీర్పేటలోని ఓ ఫామ్హౌస్లో ఈటల రాజేందర్, హరీశ్రావు కలిసి కేసీఆర్కు ఫోన్ చేసి మాట్లాడారని ఆరోపించారు.
కాళేశ్వరం స్కామ్ నుంచి బయటపడేందుకు కేసీఆర్తో చేతులు కలుపుతున్నారు అన్నారు. ఈటల.. బీజేపీలో ఉన్నా మనసు మాత్రం బీఆర్ఎస్, కేసీఆర్ మీదనే ఉందని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ సయోధ్య గురించి కవిత ఇప్పుడు బయటపెడుతున్నారని.. కానీ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ను అన్యాయంగా తొలగించలేదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్తో దోస్తీకి అడ్డుగా ఉన్నందుకే సంజయ్ను తొలగించింది వాస్తవం కాదా? అని నిలదీశారు. బీజేపీ నేతల ప్యాకేజీల గురించి ఆ పార్టీ సొంత ఎమ్మెల్యే రాజాసింగే చెబుతున్నారని.. రాజాసింగ్ మాటలకు ఆ పార్టీ పెద్దలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.