Mahesh Kumar Goud Sensational comments: తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ల ప్రమేయంతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు తమకు అనుమానం ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో పాటు ఇతర పార్టీల నేతలు పలువురు పారిశ్రామికవేత్తలు, జడ్జిలు, సినీ ప్రముఖుల ఫోన్లను విచక్షణారహితంగా ట్యాప్ చేసిన నేర చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీ నేతలను కూడా వదల్లేదని మండిపడ్డారు.
మొత్తం 650 మంది ఫోన్లు ట్యాప్ చేశారని తెలిపారు. ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద నేరమని పేర్కొన్నారు. ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ జైలుకు వెళ్లడం ఖాయమని హెచ్చరించారు. దోషులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కేసీఆర్, కేటీఆర్ ప్రమేయంతోనే జరిగిందని బలంగా నమ్ముతున్నామని స్పష్టం చేశారు. ఫోన్లు ట్యాప్ అయిన వారందరూ స్వచ్ఛందంగా సిట్ విచారణకు హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఫోన్ ట్యాపింగ్ కు గురైన బాధితుల పేర్లను సిట్ అధికారులు తక్షణమే బయటపెట్టాలని కోరారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టుతో కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. నాసిరకం పనులతో ప్రజాధనాన్ని వృథా చేశారని ఫైర్ అయ్యారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గదని తేల్చిచెప్పారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. దీనిపై మంత్రివర్గంలో చర్చించిన తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే అధికారులు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావును కూడా సిట్ అధికారులు రెండు సార్లు విచారించారు. అయితే ఆయన విచారణకు సహకరించలేదని సమాచారం. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఆయనకు ఇచ్చిన వెసులుబాటులను తొలగించాలని కోరనున్నారు. ఇక తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, ఇతర నేతలు కూడా సిట్ విచారణకు హాజరైన తమ వాంగ్మూలం అందించారు.