Tuesday, October 8, 2024
HomeతెలంగాణMaldakal: శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి సేవలో మంత్రి

Maldakal: శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి సేవలో మంత్రి

దక్షిణ కైలాసంలో..

దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని ఆలయ అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తామని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖా మాత్యులు కొండా సురేఖ అన్నారు. మంగళవారం దేవి శరన్నవరాత్రులు సందర్భంగా అలంపూర్ లోని శ్రీజోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించిన మంత్రికి దేవాలయ అర్చకులు స్వాగతం పలికారు.

- Advertisement -

ముందుగా శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయం సందర్శించి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. అనంతరం శ్రీ జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించిన తర్వాత, అర్చకులు అమ్మవారి ప్రసాదం, శేష వస్త్రం బహుకరించి ఆశీర్వాదాలు అందజేశారు. తదనంతరం మంత్రి ప్రస్తుతం జరుగుతున్న ప్రసాద్ పథకం పనులను పరిశీలించారు. పథకం ప్రణాళికను మ్యాప్‌లో చూసి ఇంకా పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పథకం పరిసరాలను కూడా తనిఖీ చేసిపథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తి పీఠమైన శ్రీ జోగులాంబ దేవిశ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. దేవి శరన్నవరాత్రులు సందర్భంగా కళ్యాణ పట్టు వస్త్రాలు సమర్పించామన్నారు. కృష్ణా-తుంగభద్ర నదుల కలయిక ఈ క్షేత్రానికి ప్రత్యేకతను ఇస్తుందని అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఇక్కడ నవబ్రహ్మణుల పూజల కారణంగా ప్రజల కష్టాలు, సమస్యలు తీరుతాయని, ఈ ఆలయాన్ని “దక్షిణ కైలాసం” అని కూడా పిలుస్తారని తెలిపారు. చాళుక్య కాలంలో ఈ క్షేత్రం ఒక వెలుగు వెలిగిందని శాతవాహనులు, బాదామి చాళుక్యుల కాలంలో ప్రసిద్ధి చెందిన క్షేత్రంగా దీనిని పశ్చిమ శ్రీశైలమని కూడా పిలుస్తారని అన్నారు. మన రాష్ట్రంలో ఇలాంటి పుణ్యక్షేత్రం ఉండటం అదృష్టమని ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు.
టెంపుల్ టూరిజం అభివృద్ధి ఎకో టూరిజం పురావస్తు శాఖలతో సమన్వయం చేసి ఈ అంశాలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి ప్రగతిని సాధించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం కేంద్రం, రాష్ట్రం నుండి కావాల్సిన నిధులు సమకూర్చే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పుష్కర్ ఘాట్ దగ్గర స్నానం కోసం మంచి ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఆలయ పరిసరాలలో పెండింగ్‌లో ఉన్న ప్రసాద్ పథకం పనులను త్వరగా పూర్తి చేస్తామని ఇందుకోసం సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించి తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నవరాత్రుల సమయంలో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆలయ ఈవోకు ఆదేశించారు. అంతకు ముందు హరిత హోటల్‌లో జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్, జిల్లా ఎస్పీ తోట శ్రీనివాస రావు పుష్పగుచ్ఛం అందజేసి, మంత్రికి స్వాగతం పలికారు.అనంతరం మంత్రి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.


ఈ కార్యక్రమంలో: జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ , జిల్లా ఎస్పీ తోట శ్రీనివాస రావు, దేవాలయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణ, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఆర్డిఓ రామచందర్, ఆలయ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, ఈ.ఓ పురేందర్, స్థానిక అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News