బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి(Malla Reddy) ఏం మాట్లాడినా సంచలనమే. ఆయన హావభావాలు, మాట్లాడే తీరు అందరినీ నవ్విస్తాయి. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో తనదైన హాస్యశైలితో నవ్వులు పూయించారు. సభలో మాట్లాడుతూ.. “అధ్యక్షా నేను రెండు ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి ప్రభుత్వానికి రూ. 1100 కోట్లు లాభం వచ్చే అంశం. రెండోది మా మేడ్చల్ నియోజకవర్గంలోని సర్పంచ్లు, కౌన్సిలర్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి” అని మల్లారెడ్డి అన్నారు. దీంతో సభ్యులు ఒక్కసారిగా నవ్వారు.
ఆ వెంటనే స్పీకర్ “రెండు వద్దు, ఒక్కదానికే అనుమతి” అని సూచించారు. దీంతో మల్లారెడ్డి ప్రసంగిస్తూ.. “మా మేడ్చల్ నియోజకవర్గానికి దిష్టి తగిలింది. 61 గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం అయ్యాయి. పదేళ్ల రిజర్వేషన్ల విధానం తెచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఐదేళ్లలోనే అన్ని రద్దు చేసింది. దయచేసి ఇదే రిజర్వేషన్ కొనసాగించాలి. మమ్మల్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయొద్దు” అంటూ కోరారు. అనంతరం “ప్రభుత్వానికి లాభం చేకూరే విషయం చెబుతాను” అనగానే స్పీకర్ అడ్డుకున్నారు. దీంతో సభలో మళ్లీ నవ్వులు పూశాయి.