Kavitha new political party speculations: బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు మీడియాతో మాట్లాడనున్నారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఉన్న జాగృతి కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఆమె విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది.
గత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, పార్టీకి నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ నిన్న బీఆర్ఎస్ పార్టీ కవితను సస్పెండ్ చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. మొన్నటి రోజున కవిత నేరుగా బీఆర్ఎస్ నేతలైన హరీశ్ రావు, సంతోష్ రావులపై అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
నేటి ప్రెస్మీట్లో కవిత ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆమె బీఆర్ఎస్ నాయకత్వంపై మరిన్ని ఆరోపణలు చేస్తారా? ముఖ్యంగా కాళేశ్వరం అవినీతి అంశంపై మరిన్ని వివరాలు వెల్లడిస్తారా? లేదా హరీశ్ రావును మరోసారి లక్ష్యంగా చేసుకుంటారా? అనే విషయాలు ప్రజలకు ఆసక్తిని కలిగిస్తున్నాయి.


