Wednesday, September 18, 2024
HomeతెలంగాణNagarkurnool: పర్యాటక హబ్ గా సోమేశ్వరాలయం

Nagarkurnool: పర్యాటక హబ్ గా సోమేశ్వరాలయం

సోమ‌శిల‌లో మొక్క‌లు నాటిన మంత్రి

ఆధ్యాత్మిక క్షేత్రం సోమేశ్వరాలయాన్ని పర్యాటక హ‌బ్ తీర్చిదిద్దుతున్నట్లు ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్చదనం- పచ్చదనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎక్సైజ్, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు పాల్గొన్నారు.

- Advertisement -

కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గం సొమ‌శిల‌లో మొక్క‌లు నాటారు. ప్ర‌తి ఒక్క‌రూ మొక్క‌లు నాటా సంర‌క్షించాల‌ని మంత్రి జూప‌ల్లి కోరారు. మొక్క‌లు ప‌చ్చ‌ద‌నంతో పాటు వ్యాధుల నుంచి కాపాడుతాయ‌ని, త‌మ ఇంటి ప‌రిస‌రాల‌తో పాటు గ్రామ‌, ప‌ట్ణ‌ణాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల‌ని సూచించారు. అదే విధంగా ప్రభుత్వ కార్యాలయాలు, కూడళ్లు, రోడ్లను శుభ్రం చేయడం, మరుగుదొడ్లు లేని ఇళ్లను గుర్తించడం, ఇళ్లలోని చెత్తను సేకరించి సెగ్రిగేషన్‌ షెడ్లకు పంపడం వంటి వాటిపై అధికారులు దృష్టి సారించాల‌ని ఆదేశించారు.
కృష్ణ న‌ది తీరాన శా స్త్రోక్తంగా కృష్ణ‌మ్మ‌కు మంత్రి జూప‌ల్లి ప్రత్యేక పూజలు చేసి హారతినిచ్చారు. అంత‌కుముందు సోమేశ్వ‌ర‌ స్వామివారిని మంత్రి జూప‌ల్లి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంత‌రం సోమ‌శిల వ‌ద్ద ప‌ర్యాట‌క అభివృద్ధికి ఉన్న అవ‌కాశాలు, చేపట్టాల్సిన ప‌నులు, అంచ‌నాలు, ప్ర‌ణాళిక‌ల రూప‌క‌ల్ప‌న‌పై అధికారుల‌తో చ‌ర్చించారు.
మంత్రి జూప‌ల్లి మాట్లాడుతూ… 365 రోజులు కృష్ణ‌నది ప‌రివాహాక ప్రాంతంలో నీళ్ల‌తో నిండుగా ఉండాల‌ని, గోదావ‌రి జ‌లాలు కృష్ణ‌మ్మ ఒడిలో చేరాల‌ని భ‌గ‌వంతుని ప్రార్థించిన‌ట్లు పేర్కొన్నారు.

ప‌ర్యాట‌క అభివృద్ధిలో భాగంగా ఇవాళ సోమ‌శిల‌ను సంద‌ర్శించిన‌ట్లు తెలిపారు. కృష్ణ, గోదావ‌రి ప‌రివాహాక ప్రాంతాల‌ను టూరిజం హాబ్ లుగా తీర్చిదిద్దుతామ‌ని వెల్ల‌డించారు. ప‌ర్యాట‌క ప్రాంతాల‌ను క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించి.. ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్శించేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌లు, మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌పై పూర్తిగా అధ్య‌య‌నం చేస్తున్నాయ‌ని అన్నారు. పాశ్చ‌త్య దేశాల్లో వారాంతాల్లో మాన‌సిన ఆహ్లాదం కోసం ప‌ర్యాట‌క ప్రాంతాల‌ను సంద‌ర్శించి సెద తీరుతార‌ని, భార‌త‌దేశంలో, మ‌న తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ప్ర‌కృతి ర‌మ‌ణీయ ప్రాంతాలు ఉన్నప్ప‌టికీ.. ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్శించేందుకు స‌రియైన చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల ప‌ర్యాట‌కాభివృద్ధి ఆశించిన స్థాయిలో జర‌గ‌లేద‌ని చెప్పారు. సీయం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎకో, టెంపుల్, మెడిక‌ల్ టూరిజంపై ప్ర‌త్యేక దృష్టి సారించిన‌ట్లు తెలిపారు. త్వ‌ర‌లోనే నూత‌న ప‌ర్యాట‌క విధానాన్ని తీసుకువ‌స్తామ‌ని అన్నారు. ప‌ర్యాట‌క అభివ‌ద్ధి వ‌ల్ల ప్ర‌భుత్వానికి ఆదాయం పెర‌గ‌డంతో పాటు ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని వివ‌రించారు.


ఈ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ సంతోష్ బ‌దావత్, పర్యాట‌క‌, పురావాస్తు శాఖ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News