Multi-level marketing investment scam : అధిక లాభాల ఆశే వారికి పెట్టుబడి.. అమాయకుల నమ్మకమే వారి ఆయుధం. ఈ సూత్రాన్ని నమ్ముకున్న ఇద్దరు బీటెక్ యువకులు, మల్టీ లెవెల్ మార్కెటింగ్ మాయాజాలంతో ఏకంగా 125 మందిని నిలువునా ముంచి రూ.8.50 కోట్లు కొల్లగొట్టారు. బంగారం, రియల్ ఎస్టేట్, క్రిప్టో కరెన్సీలలో పెట్టుబడులంటూ పక్కా ప్రణాళికతో సాగిన ఈ భారీ మోసం, ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఫిర్యాదుతో బట్టబయలైంది. ఇంతకీ ఈ కేటుగాళ్లు పన్నిన వ్యూహమేంటి? ఈ మోసపు డొంక ఎలా కదిలింది?
కేటుగాళ్ల పక్కా ప్లాన్ : నిజామాబాద్ నగరానికి చెందిన మహమ్మద్ మోయిజ్ఖాన్, హైమద్ హసన్ బీటెక్ చదివారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఆన్లైన్లో మోసాల తీరుతెన్నులను అధ్యయనం చేశారు. అనంతరం ‘స్కూటర్ ప్రాఫిట్’ అనే పేరుతో ఓ బ్లాక్చైన్ కంపెనీ, మల్టీ లెవెల్ మార్కెటింగ్ యాప్ను సృష్టించారు.
ఆశల వల: క్రిప్టో కరెన్సీ, బంగారం, తక్కువ ధరకే భూములు ఇప్పిస్తామంటూ ప్రజలను నమ్మబలికారు.
నమ్మకం కోసం: మొదట్లో చేరినవారికి, కొత్తగా చేరిన వారి డబ్బుల నుంచే కొంత మొత్తాన్ని లాభాల రూపంలో ఇచ్చి నమ్మకాన్ని చూరగొన్నారు.
విస్తరణ: ఈ నమ్మకంతోనే ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని, వారి ద్వారా జిల్లావ్యాప్తంగా 125 మంది నుంచి సుమారు రూ.8.50 కోట్లు వసూలు చేశారు.
ఉపాధ్యాయుడితో కదిలిన డొంక : ఈ ముఠా వలలో ఇందల్వాయికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కూడా చిక్కారు. మొదట్లో లాభాలు రావడంతో, ఆయనే స్వయంగా ఏజెంటుగా మారి పలువురితో పెట్టుబడులు పెట్టించారు. ఏడాది పాటు సజావుగా సాగిన ఈ వ్యవహారం, నిందితులు డబ్బులు చెల్లించడం ఆపేయడంతో బెడిసికొట్టింది. తాము మోసపోయామని గ్రహించిన ఉపాధ్యాయుడు, వెంటనే ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
“గోల్డ్, రియల్ ఎస్టేట్, క్రిప్టోలలో పెట్టుబడులంటూ జిల్లాలోని 125 మంది నుంచి రూ.8.50 కోట్లు కాజేశారు. ఇలాంటి మోసాల్లో, నిందితులు కొత్తగా చేరిన వారి డబ్బులనే పాతవారికి లాభాలుగా ఇస్తారు. పెద్ద మొత్తంలో డబ్బు చేరాక ముఖం చాటేస్తారు. ఈ కేసులోనూ అదే జరిగింది. నిందితులు దిల్లీ, ముంబయి వంటి నగరాల్లోనూ సమావేశాలు పెట్టి మోసాలకు పాల్పడినట్లు తెలిసింది.”
– నాగేంద్రచారి, నిజామాబాద్ సీసీఎస్ ఏసీపీ
రంగంలోకి సీసీఎస్ పోలీసులు : కేసును సీరియస్గా తీసుకున్న సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేపట్టి, ప్రధాన నిందితులైన మోయిజ్ ఖాన్, హసన్లను అరెస్టు చేశారు. వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. ఈ మోసం కేవలం నిజామాబాద్కే పరిమితం కాలేదని, దిల్లీ, ముంబయి, కలబురిగి వంటి నగరాల్లోనూ వీరు మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. బాధితులతో నిందితులే కాకుండా వేర్వేరు వ్యక్తులు మాట్లాడినట్లు తేలిందని, ఇంకా బాధితులు ఎవరైనా ఉంటే నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలని ఏసీపీ నాగేంద్రచారి కోరారు. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించవచ్చనే మాయమాటలను నమ్మవద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.


