Thursday, June 12, 2025
HomeతెలంగాణPalla Rajeshwar Reddy: కేసీఆర్ నివాసంలో జారిపడ్డ ఎమ్మెల్యే పల్లా.. తుంటి ఎముకకు గాయం

Palla Rajeshwar Reddy: కేసీఆర్ నివాసంలో జారిపడ్డ ఎమ్మెల్యే పల్లా.. తుంటి ఎముకకు గాయం

Palla Rajeshwar Reddy:కాళేశ్వరం కమిషన్ ముందు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరయ్యే ముందు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. విచారణకు బయలుదేరే ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దంపతులు ఫాంహౌస్‌లో కేసీఆర్‌ను కలిశారు. అలాగే పార్టీ ముఖ్య నేతలు కూడా ఫామ్ హౌస్ చేరుకున్నారు. అయితే పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్కడ జారిపడ్డారు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం హుటాహుటిన హైదరాబాద్‌ లోని యశోద ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. తుంటి ఎముకకు గాయం కావడంతో వైద్యులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ విచారణ నేపథ్యంలో ఈ ఘటన జరగడంతో కార్యకర్తలు, నేతలు ఆందోళనలు చెందుతున్నారు. పల్లా త్వరగా కోలుకోవాలని పలువురు నేతలు ఆకాంక్షిస్తున్నారు.

కాగా ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీకి చెడ్డ రోజులు నడుస్తున్నట్లు ఉంది. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా పార్టీలో అంతర్గత తిరుగుబాటు మొదలైంది. వరంగల్ ఆవిర్భావ సభ నేపథ్యంలో కేసీఆర్ కు కవిత లేఖ రాయడం.. ఆ లేఖ లీక్ కావడం సంచలనంగా మారింది. ఆ వెంటనే తాను రాసిన లేఖ ఎలా లీక్ అయిందని.. కేసీఆర్ పక్కన దెయ్యాలు ఉన్నారంటూ కవిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అప్పటి నుంచి ఆమె పార్టీతో సంబంధం లేకుండా తెలంగాన జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఇదిలా ఉండగానే కేసీఆర్, కేటీఆర్ సన్నిహితుడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణం చెందారు. గుండెపోటుకు గురైన గోపినాథ్ మూడు రోజుల చికిత్స అనంతరం కన్నుమూశారు. మాగంటి భౌతికకాయం చూడటానికి వచ్చిన కేసీఆర్.. కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ కలచివేసింది. ఇప్పుడు మరో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలు జారి పడటం.. తుంటి ఎముక విరగడంతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇక ఏకంగా కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరుకానున్నారు. మొత్తంగా ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు గులాబీ శ్రేణులను తీవ్ర కలవరానికి గురి చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News