Saturday, November 15, 2025
HomeతెలంగాణPeople's Doctor: వైద్యో నారాయణో హరి.. ఇరవై రూపాయలకే అనారోగ్య నివారి!

People’s Doctor: వైద్యో నారాయణో హరి.. ఇరవై రూపాయలకే అనారోగ్య నివారి!

Doctor provides medical treatment for 20 rupees : సినిమాల్లో ఓ డాక్టర్ కేవలం ఐదు రూపాయలు తీసుకుని పేదలకు వైద్యం అందిస్తే చప్పట్లు కొడతాం, అలాంటి వైద్యులు నిజజీవితంలో ఉంటే ఎంత బాగుంటుందో అని అనుకుంటాం. కానీ అది సినిమా కాదు, నిజం. కార్పొరేట్ ఆసుపత్రులు ఫీజుల రూపంలో వేలకు వేలు వసూలు చేస్తున్న ఈ రోజుల్లో, ఓ వైద్యుడు కేవలం ఇరవై రూపాయలకే వైద్యం అందిస్తూ ‘వైద్యో నారాయణో హరి’ అనే మాటకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలను సైతం కాదనుకుని, నలభై ఏళ్లుగా పేదల సేవకే తన జీవితాన్ని అంకితం చేసిన ఆయనే సూర్యాపేట జిల్లా ప్రజావైద్యుడు డాక్టర్ కొప్పుల రంగారెడ్డి. ఇంతకీ ఆయన ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఆయన స్ఫూర్తిదాయక ప్రస్థానం వెనుక ఉన్న కథేంటి?

- Advertisement -

బంధువుల అనారోగ్యమే.. వైద్యుడిగా మార్చిన పట్టుదల :  సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలోని ఓ మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టిన  రంగారెడ్డి, చిన్నతనం నుంచే కష్టపడి పనిచేసే తత్వాన్ని అలవర్చుకున్నారు. పొలం పనులు చేస్తూ, పశువులను మేపుతూనే తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. ఆ రోజుల్లో తన బంధువులు, చుట్టుపక్కల ప్రజలు అనారోగ్యం పాలైనప్పుడు సరైన వైద్యం అందక పడుతున్న ఇబ్బందులను కళ్లారా చూశారు. ఆ సంఘటనలే ఆయనలో డాక్టర్ కావాలనే బలమైన ఆకాంక్షను రగిలించాయి. అకుంఠిత దీక్షతో చదివి, హైదరాబాద్‌లోని గాంధీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పట్టా పుచ్చుకున్నారు.

ప్రభుత్వ కొలువును కాదనుకుని.. ప్రజాసేవకే శ్రీకారం : ఎంబీబీఎస్ పూర్తయ్యాక, ప్రభుత్వ వైద్యుడిగా స్థిరపడేందుకు ఎన్నో అవకాశాలు తలుపుతట్టాయి. కానీ, చిన్ననాటి తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలనే తపనతో వాటన్నింటినీ సున్నితంగా తిరస్కరించారు. పేదలకు అందుబాటులో వైద్యం అందించాలనే సంకల్పంతో 1983-84 మధ్యకాలంలో సూర్యాపేటలోనే ఓ చిన్న ఆసుపత్రిని ప్రారంభించారు. సంపాదన ముఖ్యం కాదని, రోగుల సేవే పరమావధి అని భావించిన ఆయన, తొలుత కేవలం రూ.3 ఫీజుతో తన వైద్య ప్రస్థానాన్ని మొదలుపెట్టారు.

రూ.3 నుంచి రూ.20 వరకు.. నలభై ఏళ్ల నిస్వార్థ సేవ : ప్రారంభంలో రూ.3గా ఉన్న ఫీజును, కాలక్రమేణా పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా రూ.5, రూ.7, రూ.10కి పెంచుతూ, ప్రస్తుతం నామమాత్రంగా రూ.20 తీసుకుంటున్నారు. గత నలభై ఏళ్లుగా అద్దె భవనంలోనే రెండు పడకల ఆసుపత్రిని నిర్వహిస్తున్న డాక్టర్ రంగారెడ్డి వద్దకు చికిత్స కోసం రోజూ సగటున 50 మంది వస్తుంటారు. ఫీజు చెల్లించలేని నిరుపేదలకు ఉచితంగానే వైద్యం అందించి, మందులు రాసివ్వడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనం. “మా ఇంట్లో ఎవరికి బాగాలేకపోయినా రంగారెడ్డి డాక్టర్ దగ్గరికే వస్తాం. ఆయన ఒక్కసారి నాడి పడితే చాలు, జబ్బు నయమైపోతుందన్నది మా గట్టి నమ్మకం” అని అక్కడ వైద్యానికి వచ్చిన రోగులు చెప్పడం ఆయనపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి ప్రతీక.

కరోనా మహమ్మారి విజృంభించిన క్లిష్ట సమయంలోనూ ఆయన తన సేవలను ఆపలేదు. తగిన జాగ్రత్తలు పాటిస్తూ ప్రజలకు వైద్యం అందించారు. “నా కుటుంబ సహకారంతోనే ఇంత తక్కువ ఫీజుతో ఇప్పటికీ వైద్యసేవను కొనసాగించగలుగుతున్నాను. వచ్చే వారిలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల వారే. వారి రుగ్మతను గుర్తించి, అవసరమైన మందులు రాస్తాను” అని డాక్టర్ రంగారెడ్డి వినమ్రంగా చెబుతారు. కొంతకాలం బస్తీదవాఖానలో కూడా పనిచేసి, తన సేవలను మరింత విస్తృతం చేశారు. ఆయన నిస్వార్థ సేవ నేటి యువ వైద్యులకు స్ఫూర్తిదాయకం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad