Saturday, November 15, 2025
HomeతెలంగాణPM Surya Ghar Yojana: ఇంటిపై సోలార్ పలకలు - కరెంటు బిల్లు సున్నా.. పైగా...

PM Surya Ghar Yojana: ఇంటిపై సోలార్ పలకలు – కరెంటు బిల్లు సున్నా.. పైగా అదనపు ఆదాయం!

PM Surya Ghar Yojana application : నెలనెలా పెరిగిపోతున్న కరెంటు బిల్లులతో సతమతమవుతున్నారా? మీ ఇంటినే ఓ చిన్న విద్యుత్ కేంద్రంగా మార్చుకుని, బిల్లుల భారం నుంచి బయటపడటమే కాకుండా, అదనపు ఆదాయం సంపాదించే మార్గం ఉందని మీకు తెలుసా..? కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఓ అద్భుత పథకం ఇప్పుడు మీ ఇంటికి సౌర వెలుగులను తెస్తోంది. అసలు ఈ పథకం ఏంటి..? ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? ఎంత రాయితీ లభిస్తుంది..? అదనపు ఆదాయం ఎలా వస్తుంది..?

- Advertisement -

విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించి, పర్యావరణహితమైన సౌర విద్యుత్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం “ప్రధానమంత్రి సూర్యఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన”కు శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకునే వారికి భారీ రాయితీని అందిస్తోంది. దీని ద్వారా కేవలం మీ ఇంటి అవసరాలకు సరిపడా విద్యుత్‌ను ఉచితంగా పొందడమే కాకుండా, అదనంగా ఉత్పత్తి అయిన కరెంటును తిరిగి విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కమ్‌)కు విక్రయించి డబ్బు సంపాదించే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది.
ఈ పథకంపై పట్టణవాసులతో పాటు గ్రామీణులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఉదాహరణకు, ములుగు జిల్లాలో ఇప్పటికే 50 సౌర ప్యానెళ్లను అమర్చుకున్నారని, గృహజ్యోతి పథకం పరిధిలోకి రాని వినియోగదారులను అధికారులు ఈ దిశగా ప్రోత్సహిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం ఇలా: ఈ పథకానికి దరఖాస్తు ప్రక్రియ చాలా సులభం. కింది దశలను అనుసరించి ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా అధికారిక పోర్టల్ https://www.pmsuryaghar.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి. మీ ఈ-మెయిల్ ఐడీ, మీ ఇంటి విద్యుత్ కనెక్షన్ సర్వీస్ నంబర్,  మొబైల్ నంబర్లతో రిజిస్ట్రేషన్ పూర్తిచేయాలి.
అనంతరం మీ సర్వీస్ నంబర్, మొబైల్ నంబరుతో లాగిన్ అయి, దరఖాస్తు ఫారాన్ని నింపాలి.
గతంలో మీరు వినియోగించిన విద్యుత్‌కు సంబంధించిన వివరాలను (పాత బిల్లుల ఆధారంగా) అందులో పొందుపరచాలి. ఈ వివరాలు నమోదు చేశాకే మీ దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.

రాయితీ నేరుగా మీ ఖాతాలోకి : మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత, టీజీ రెడ్కో (తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ), డిస్కమ్ అధికారులు, మరియు ఎంపిక చేసిన సోలార్ కంపెనీ ప్రతినిధులు మీ ఇంటిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. వారి ఆమోదం తర్వాత మీరు నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తే, సోలార్ పలకలు, ప్యానెల్ బోర్డులను బిగిస్తారు. ట్రాన్స్‌కో ద్వారా కొత్త మీటర్‌ను అమరుస్తారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక, ప్రభుత్వం అందించే రాయితీ సొమ్ము నేరుగా మీ బ్యాంకు ఖాతాలోనే జమ అవుతుంది.

అదనపు ఆదాయం ఇలా: మీరు వినియోగించుకోగా మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు పంపిస్తారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి లెక్కించి, అదనంగా ఉత్పత్తి అయిన ప్రతి యూనిట్‌కు రూ.3.10 చొప్పున డిస్కమ్ మీకు డబ్బు చెల్లిస్తుంది.

ప్రయోజనాలు ఒక్కసారి చూడండి..
ఉచిత విద్యుత్: మీ ఇంటికి అవసరమైన విద్యుత్ దాదాపు ఉచితంగా లభిస్తుంది.
డబ్బు ఆదా: ఉదాహరణకు, 3 కిలోవాట్ల సోలార్ సిస్టమ్‌ను అమర్చుకుంటే, నెలకు 300 యూనిట్లు వాడే కుటుంబం ఏడాదికి సుమారు రూ.15,000 ఆదా చేసుకోవచ్చు.

భారీ రాయితీ: 2 కిలోవాట్ల వరకు సామర్థ్యం గల సిస్టమ్‌లకు 60% సబ్సిడీ, 2 నుంచి 3 కిలోవాట్ల మధ్య సిస్టమ్‌లకు 40% సబ్సిడీ లభిస్తుంది.

సులభ రుణాలు: ఈ ప్యానెళ్ల ఏర్పాటుకు ఎటువంటి పూచీకత్తు లేని సులభ రుణాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

పర్యావరణ హితం: కర్బన ఉద్గారాలను తగ్గించి, పర్యావరణ పరిరక్షణలో మీరు కూడా భాగస్వాములవుతారు.

“రూఫ్‌టాప్ కలిగిన ప్రతి ఇంటి యజమాని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇది కరెంటు బిల్లుల భారాన్ని తగ్గించడమే కాకుండా, దీర్ఘకాలంలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది,” అని తెలంగాణ పునరుత్పాదక, ఇంధన వనరుల సంస్థ జిల్లా మేనేజర్ జి.రాజేందర్ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad