Thursday, September 19, 2024
HomeతెలంగాణRevanth Reddy: ఇదే శాసనం ఇదే జీవో

Revanth Reddy: ఇదే శాసనం ఇదే జీవో

వచ్చే ఏడాది నుంచి గద్దర్ అవార్డు

రవీంద్రభారతిలో ప్రజా యుద్ధ నౌక జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సమాజాన్ని చైతన్యం చేసేందుకు గజ్జె కట్టి గళం విప్పిన గొప్ప వ్యక్తి గద్దరన్న అంటూ నివాళి అర్పించిన రేవంత్.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఉద్యమం మొదలు పెట్టిన వ్యక్తి గద్దరన్న అని గుర్తుచేశారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని మళ్లీ ఉద్యమం మొదలు పెట్టింది గద్దరన్న, ప్రజా ప్రభుత్వం ఏర్పడాలన్న గద్దరన్న మాటలు మాకు స్ఫూర్తి అంటూ ప్రసంగించారు.

- Advertisement -

ఆయనతో మాట్లాడితే మాకు వెయ్యేనుగుల బలం వచ్చేదన్న రేవంత్, ఆ బలంతోనే గడీల ఇనుప కంచెల బద్దలు కొట్టి ప్రజా ప్రభుత్వంలో జ్యోతిరావు పూలే భవన్ గా మార్చామన్నారు. ఏ దళితుడిని సీఎం చేస్తానని మాట ఇచ్చి కేసీఆర్ మోసం చేశారో మా ప్రజా ప్రభుత్వంలో ఆ దళితుడికే వచ్చి ఎమ్మెల్సీ కవిత పూలే విగ్రహం కోసం వినతిపత్రం ఇచ్చారన్నారు.

ఎవరైనా వచ్చి వినతిపత్రం ఇచ్చే స్వేచ్ఛ ఈ ప్రభుత్వంలో ఉందని, గద్దరన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన ప్రతిపక్ష నాయకులు శపనార్ధాలు పెడుతున్నారన్నారు.

ఆరు నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారంటూ కొందరు కలలు కంటున్నారని హెచ్చరించిన రేవంత్, అలాంటి ఆలోచన చేసిన వారిని తెలంగాణ ప్రజలు ఘోరీ కడతారన్నారు. అది వాళ్ల ఒంటికి-ఇంటికి మంచిది కాదన్నారు. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఐదేళ్లు సుస్థిరమైన పాలన అందించే బాధ్యత మాదన్నారు.

కవులు, కళాకారులకు, సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున గద్దర్ అవార్డును ప్రదానం చేస్తామని, ఈ వేదికగా చెబుతున్నాఇదే శాసనం ఇదే జీవో అన్నారు. వచ్చే ఏడాది నుంచి గద్దరన్న ప్రతీ జయంతి రోజున ఈ పురస్కారాలను ప్రదానం చేస్తామన్నారు రేవంత్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News