Friday, September 20, 2024
HomeతెలంగాణSingareni: సింగరేణిలో కొత్త వేజ్ బోర్డ్ జీతాలు

Singareni: సింగరేణిలో కొత్త వేజ్ బోర్డ్ జీతాలు

కోల్ ఇండియా కన్నా ముందే సింగరేణి కార్మికులకు కొత్త వేజ్ బోర్డు జీతాలు

డైలీ రేటెడ్ కేటగిరి 1 బేసిక్ రూ.1011.27 నుంచి రూ.1502.66కు పెరుగుదల మంత్లీ రేటెడ్ ఏ1 గ్రేడ్ బేసిక్ రూ.98,485.79 ఉన్న‌వారికి రూ.1,46,341.67కు పెరుగుదల.

- Advertisement -

2023 జాతీయస్థాయిలో ఇటీవలనే కుదిరిన 11వ వేజ్ బోర్డు వేతనాలను సింగరేణి కార్మికులకు తక్షణమే అమలు జరపాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. సంస్థ చైర్మన్, ఎండి ఎన్‌.శ్రీ‌ధ‌ర్ ఆదేశం మేరకు ఫైనాన్స్, పర్సనల్ ఎన్‌.బ‌ల‌రామ్ స్వీయ పర్యవేక్షణలో యుద్ధ ప్రాతిపదిక న ఏర్పాట్లు పూర్తి చేసి జూన్ నెల జీతాలను సోమవారం 3 తేదీన కార్మికుల బ్యాంకు ఖాతాలలో జమ చేయనుంది. గత పది వేజ్ బోర్డు జీతాల అమలుతో పోలిస్తే ఇది ఒక సంచలన నిర్ణయంగా పేర్కొనవచ్చు. గతంలో వేజ్ బోర్డు నిర్ణయాలు జరిగిన తర్వాత జీతాల చెల్లింపుకు నెలల తరబడి సమయం పడుతుండేది. పైగా కోలిండియాలో అమలు జరిపిన తర్వాతనే సింగరేణిలో అమలు జరిపితుండేవారు. కానీ ఈసారి దీనికి భిన్నంగా కోల్ ఇండియా కన్నా ముందే సింగరేణి కార్మికులకు కొత్త పేజీ బోర్డు జీతాలు అందించడం విశేషం.
కొత్త జీతాల అమలు వల్ల సింగరేణి యాజమాన్యం ఏడాదికి సుమారు 1000 కోట్ల రూపాయల అదనపువ్యయాన్ని భరించాల్సి ఉంటుంది. అయినప్పటికీ కార్మికుల అభీష్టం మేరకు తక్షణమే కొత్త జీతాలు అమలు జరపాలని నిర్ణయించామని, చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ ఆదేశం మేరకు జీతాల చెల్లింపుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేసామని డైరెక్టర్ ఫైనాన్స్ మరియు పర్సనల్ ఎన్.బలరాం తెలియజేశారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి బొగ్గు గని ఉద్యోగుల వేతనాలను చర్చించి, నిర్ణయించే జెబిసిసిఐ–XI సమావేశాలు ఈ మధ్యనే ముగిశాయి, ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బొగ్గు పరిశ్రమలో పనిచేసే ఉద్యోగుల జాతీయ వేతన ఒప్పందం (ఎన్.సి.డబ్ల్యూ.ఏ-XI) ద్వారా పెరిగిన బేసిక్ ఇతర అలవెన్సులను ఈనెల జీతాల నుండే ఉద్యోగులకు చెల్లించేందుకు సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది.

తదనగుణంగా ఎన్.సి.డబ్ల్యూ.ఏ- XI కింద జేబిసిసిఐ వద్ద అంగీకరించబడిన వివరాల ప్రకారం ఒక అండర్ గ్రౌండ్ ఉద్యోగి కనిష్ట స్థాయి మరియు గరిష్ట స్థాయి డెసిగ్నేషన్ ల యొక్క జీతాలు ఈ విధంగా ఉండనున్నాయి. డైలీ రేటెడ్ కేటగిరి 1 యొక్క బేసిక్ ఇంతకుమునుపు ఎన్.సి.డబ్ల్యూ.ఏ-X ప్రకారం రోజుకు రూ.1011.27 ఉండగా ఇప్పుడు ఎన్.సి.డబ్ల్యూ.ఏ-XI ప్రకారం రోజుకు రూ.1502.66 అయింది. అదేవిధంగా మంత్లీ రేటెడ్ A1 గ్రేడ్ యొక్క బేసిక్ ఇంతకుముందు ఎన్.సి.డబ్ల్యూ.ఏ-X ప్రకారం నెలకు రూ. 98,485.79 పొందేవారికి ఇప్పుడు ఎన్.సి.డబ్ల్యూ.ఏ-XI ప్రకారం నెలకు రూ.1,46,341.67 అయింది. మారిన కొత్త బేసిక్ ల ప్రకారం డైలీ రేటెడ్ కేటగిరి 1 ఉద్యోగి స్థూలంగా నెలకు రూ. 59,386.57 జీతంగా పొందనున్నారు. అదేవిధంగా మంత్లీ రేటెడ్ అండర్ గ్రౌండ్ A1 గ్రేడ్ లోని గరిష్ట బేసిక్ అయిన రూ. 1,46,341.67 ఉన్న ఉద్యోగులు స్థూలంగా నెలకు రూ. 2,16,618.74 జీతంగా పొందనున్నారు. సింగరేణి సంస్థ చైర్మన్ & ఎండీ ఎన్.శ్రీధర్, ఐఏఎస్ ఆదేశాలననుసరించి ఎన్.సి.డబ్ల్యూ.ఏ-XI ప్రకారం పెరిగిన వేతనాలను సాప్ పెరోల్ ద్వారా కార్యరూపం దాల్చేందుకు కృషిచేసిన ఫైనాన్స్, ఐటీ, ఈఆర్పి మరియు హెచ్ఆర్ పేరోల్ అధికారులు, ఉద్యోగులను గౌరవ డైరెక్టర్ ఫైనాన్స్/ పర్సనల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వెల్ఫేర్ ఎన్.బలరాం ఐఆర్ఎస్ ప్రత్యక్షంగా పర్యవేక్షించి అభినందనలు తెలియజేశారు. సింగరేణి ఉద్యోగులు, యూనియన్లు ఈ పెరిగిన వేతనాలను సద్వినియోగం చేసుకుంటూ కంపెనీ ఉత్పత్తికి, ఉత్పాదకతలకు తోడ్పడాలని కోరారు. కోలిండియాలో ఇంకా వేజ్‌బోర్డు లో నిర్ణ‌యించిన వేత‌నాల చెల్లింపు జ‌ర‌గ‌క‌ముందే, సింగ‌రేణిలో జూన్ నెల వేత‌నాల‌తో పెరిగిన బేసిక్, అల‌వెన్స్‌ల‌ను అమ‌లు చేస్తుండటం విశేషం. ఈ వేతన పెరుగుదల వలన సింగరేణి సంస్థపై నెలకు దాదాపుగా ఏడాదికి వెయ్యి కోట్ల పైచిలుకు భారం పడనుందని అయినప్పటికీ కూడా ఉద్యోగుల సంక్షేమం కోసం సింగరేణి సంస్థ ఇతర సంస్థలతో పోలిస్తే సర్వదా ముందంజలో ఉంటుందని గౌరవ చైర్మన్ ఎన్.శ్రీధర్, ఆయన సారథ్యంలోని గౌరవనీయుల డైరెక్టర్లు అందరి సహాయ సహకారాలతో సింగరేణి సంస్థ తెలంగాణకే తలమానికంగా నిలుస్తోందని తెలుపుతూ ఈనెల జీతాల నుండే పెరిగిన వేతనాలను జూన్ 2023 నుండే ఉద్యోగులకు ఇచ్చేందుకు నిర్ణయించి అమలు చేస్తున్న చైర్మన్ గారికి అందరు డైరెక్టర్లకు జనరల్ మేనేజర్ పర్సనల్ ఐఆర్ & పీఎం బి.హనుమంతరావు కృతజ్ఞతలు తెలియజేశారు.

పెరిగిన జీతాల అమలులో ఏవేని కొన్ని స్వల్ప తేడాలు గమనించినట్లయితే వాటిని రాబోయే నెల పేరోల్ ద్వారా సరి చేయగలమని తెలిపారు. పెరిగిన జీతాల గణన, చెల్లింపు అమలు లో సమన్వయం చేసి సహకరించిన డైరెక్టర్లు ఎన్.బలరాం, ఐ.ఆర్.ఎస్ (డైరెక్టర్ ఫైనాన్స్ & పా), డి.సత్యనారాయణ రావు (డైరెక్టర్ ఈ &ఏమ్), ఎన్.వి.కే శ్రీనివాస్ (డైరెక్టర్ ఆపరేషన్స్), జీ.వేంకటేశ్వర రెడ్డి (డైరెక్టర్ పి&పి), శ్రీ M సురేష్ (జిఏమ్ కో-ఆర్డినేషన్), ఫైనాన్స్ జిఏమ్ లు జీ.వెంకటరమణ, ఎమ్.సుబ్బారావు, పర్సనల్ విభాగ అధికారులు శ్రీ బి హనుమంతరావు, జిఏమ్, ఐ.ఆర్&పీఎం, ఏ.కుమార్ రెడ్డి (రిటైర్డ్ జిఏమ్ ఐఆర్&పీఎం), కవితా నాయుడు (ఏ.జీ.ఎమ్. పర్) మరియు ప్రాజెక్ట్ మేనేజర్, సాప్ ఇ.ఆర్.పి శ్రీహర ప్రసాద్, ఐటీ మేనేజర్ వేణు గోపాలరావు, పీఎం , హెచ్ఆర్ పేరోల్ ఎస్.వేంకటేశ్వర రావు, ఐఆర్ వింగ్, ఎస్ఏపీ పే రోల్ , ఇంటర్నల్ ఆడిట్, ఐటీ తదితర అధికారులు మరియు సిబ్బందికి సంస్థ ఛైర్మన్ & ఎండీ ఎన్.శ్రీధర్, ఐఏఎస్ అభినందనలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News