South Central Railway Plans 3 Major Railway Terminals Around Hyderabad: అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్ శిగలో మరో మణిహారం చేరనుంది. అభివృద్ధిలో దేశంలోనే అత్యంత వేగంగా దూసుకెళ్తున్న హైదరాబాద్ చుట్టూ ౩హైదరాబాద్ చుట్టూ 3 భారీ రైల్వే టెర్మినళ్లు రానున్నాయి. దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్ల రద్దీ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరం చుట్టూ కొత్తగా మూడు భారీ రైల్వే టెర్మినళ్లను నిర్మించేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా వంటి నగరాలకు శివారు ప్రాంతాల్లో రైల్వే టెర్మినళ్లు ఉన్నాయి. దూరప్రాంతాల నుంచి వచ్చే రైళ్లను, ఆయా నగరాల మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే ఎక్స్ప్రెస్లను వాటి శివారు ప్రాంతాలకు పరిమితం చేస్తున్నారు. అదే రీతిలో హైదరాబాద్ చుట్టూ మూడు రైల్వే టెర్మినళ్లను ఔటర్ రింగ్ రోడ్డుకు, రీజనల్ రింగు రోడ్డుకు మధ్యలో నిర్మించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు సిద్ధం చేసింది. వరంగల్ మార్గంలో చర్లపల్లి టెర్మినల్ను నిర్మించి అందుబాటులోకి తీసుకురాగా.. వికారాబాద్-ముంబయి మార్గంలో నాగులపల్లి వద్ద టెర్మినల్ (రామచంద్రాపురం మండలం) నిర్మించే యోచనలో ఉంది. దీంతో పాటు మహబూబ్నగర్-బెంగళూరు (జూకల్-శంషాబాద్), నిజామాబాద్-నాందేడ్ (డబిల్పుర్-మేడ్చల్) మార్గాల్లోనూ కొత్త టెర్మినళ్లపై రైల్వేశాఖ దృష్టి పెట్టింది. ప్రతిపాదిత ఈ స్టేషన్ల వివరాల్ని గురువారం సీఎం రేవంత్రెడ్డితో జరిగిన సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.
READ ALSO: https://teluguprabha.net/telangana-news/telangana-new-ration-card-ekyc-mandatory/
పెరుగుతున్న నగర జనాభాకు తగ్గట్లుగా..
రద్దీ దృష్ట్యా ప్రస్తుతం సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ ప్రధాన స్టేషన్లపై ఒత్తిడి అధికంగా ఉంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి ఆయా స్టేషన్లకు చేరుకునేందుకు గంట, గంటన్నర సమయం పడుతోంది. ఉదయం ఆయా స్టేషన్లలో ప్లాట్ఫారాల సమస్య అధికంగా ఉంది. ఈ నేపథ్యంలోనే దక్షిణ మధ్య రైల్వే మూడు కొత్త టెర్మినళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అవి అందుబాటులోకి వస్తే ప్రయాణికుల ఇబ్బందులతో పాటు ప్రధాన స్టేషన్లపై ఒత్తిడి తగ్గుతుంది. కాగా, ప్రస్తుత అవసరాలతో పాటు రానున్న రెండు దశాబ్దాల్లో పెరిగే హైదరాబాద్ మహానగర జనాభాకు అనుగుణంగా ౩ భారీ రైల్వే టెర్మినళ్లు నిర్మించాలని దక్షిణ మధ్య రైల్వే యోచిస్తోంది. రాబోయే కాలంలో రైలు ప్రయాణాల వృద్ధి, డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని మూడు భారీ టెర్మినళ్లకు రైల్వేశాఖ రూపకల్పన చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో 2025లో 1.13 కోట్లుగా ఉన్న జనాభా… 2031లో 1.84 కోట్లకు 2047లో 3.30 కోట్లకు పెరుగుతుందని రైల్వేశాఖ అంచనా వేస్తోంది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా కొత్త టర్మినళ్లు నిర్మించాలని ప్రణాళికలు రచిస్తోంది.


