Special Train For Thirupathi: ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరనుంది. ఇకపై కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శనం సులభతరం కానుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి ఫలితంగా కరీంనగర్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. జూలై 6 నుండి నడిచే ఈ రైలు ఉత్తర తెలంగాణ భక్తులకు శ్రీవారి దర్శనాన్ని సులభతరం చేస్తుంది.
మంత్రి పొన్నం కృషితో..
భక్తుల సౌకర్యార్థం కరీంనగర్ నుంచి తిరుపతికి నిత్యం రైలు నడపాలని మంత్రి పొన్నం పలుమార్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు విజ్ఞప్తి చేశారు. ఇటీవల కరీంనగర్ రైల్వే స్టేషన్ పునః ప్రారంభం సందర్భంగా, మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర మంత్రి బండి సంజయ్కి ఈ విషయమై మరోసారి విజ్ఞప్తి చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తికి రైల్వే శాఖ సానుకూలంగా స్పందించింది. కరీంనగర్ నుంచి తిరుపతికి వెళ్లే రైలు సేవలను పెంచుతూ ఈరోజు (గురువారం) ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రత్యేక రైలు సేవలు, షెడ్యూల్:
ఈ ప్రత్యేక రైలు జూలై 6 నుంచి జూలై చివరి వరకు నడిపించనున్నారు. ఇది ప్రతి ఆదివారం రాత్రి 7:45 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి సోమవారం ఉదయం 10:00 గంటలకు కరీంనగర్ చేరుకుంటుంది. తిరిగి, సోమవారం సాయంత్రం 5:30 గంటలకు కరీంనగర్ నుంచి బయలుదేరి మంగళవారం ఉదయం 8:25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ప్రయాణికుల రద్దీని బట్టి ఈ ప్రత్యేక రైలును రెగ్యులర్గా నడిపే అవకాశం ఉంది.
కృతజ్ఞతలు :
కరీంనగర్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలును మంజూరు చేసిన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు, ఈ ప్రక్రియకు సహకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్కు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రత్యేక రైలు సేవలను ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ రైలు ప్రారంభం ద్వారా వేలాది మంది భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం మరింత సులభతరం అవుతుందని ఆకాంక్షించారు.