Sunday, November 16, 2025
HomeతెలంగాణOrganic Farming Success Story: రసాయనాలకు రాంరాం... ప్రకృతి సేద్యంతో పైసా పరంధాం!

Organic Farming Success Story: రసాయనాలకు రాంరాం… ప్రకృతి సేద్యంతో పైసా పరంధాం!

natural farming models: ఒకవైపు యూరియా బస్తా కోసం రైతులు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరుతున్నారు… తెల్లవారకముందే సహకార సంఘాల ముందు పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు, అసలు యూరియా అనే మాటే ఎరుగకుండా, ప్రకృతిని నమ్ముకుని కొందరు అన్నదాతలు లాభాల పంట పండిస్తున్నారు. యూరియా లేకపోతే దిగుబడి రాదనే ఆందోళనల మధ్య, రసాయనాలు లేకుండానే అధిక దిగుబడులు ఎలా సాధిస్తున్నారు..? తక్కువ ఖర్చుతో రెట్టింపు ఆదాయం ఎలా ఆర్జిస్తున్నారు..? ఆ ప్రగతిశీల రైతుల విజయ రహస్యాలేంటి..?

- Advertisement -

భూమికి మళ్లీ ప్రాణం: సాగు పనులు ముమ్మరమైన వేళ, యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. అయితే, ఈ రసాయనాలకు ప్రత్యామ్నాయంగా ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేసిన కొందరు రైతులు నేడు ఆదర్శంగా నిలుస్తున్నారు. సొంతంగా కషాయాలు, జీవామృతం తయారుచేసుకుంటూ, భూమిని సారవంతం చేయడమే కాకుండా, ఆరోగ్యకరమైన ఉత్పత్తులతో మార్కెట్‌లో మంచి ధర పలుకుతున్నారు.

పదేళ్ల ప్రకృతి ప్రయాణం – మల్లేశం: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన మల్లేశం పదేళ్ల క్రితమే ప్రకృతి సేద్యం వైపు మళ్లారు. నాలుగు ఎకరాల్లో కూరగాయలు, చెరకు, చిరుధాన్యాలు, అల్లం పండిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. డీడీఎస్-కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల సూచనలతో సొంతంగా కషాయాలు తయారుచేసుకుని వాడుతున్నారు. సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉండటంతో, రసాయనాలతో పండించే వారికంటే అధిక ఆదాయం ఆర్జిస్తున్నారు.

సమీకృత సేద్యంతో సరికొత్త ఆదాయం – ప్రమోద్: మెదక్ జిల్లాకు చెందిన ప్రమోద్ ఎనిమిదేళ్ల క్రితం రసాయనాలతో వ్యవసాయం చేసి నష్టపోయారు. ఆ అనుభవంతో సేంద్రియ సాగు బాట పట్టారు. ఎనిమిది ఎకరాల్లో వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేస్తూ, కేవలం ఒకే దఫా యూరియా వాడి, మిగతా సమయాల్లో కషాయాలనే వినియోగిస్తున్నారు. దీనికి తోడు నాటుకోళ్ల ఫారం, జీవాల పెంపకంతో వ్యవసాయ అనుబంధ రంగాల్లోనూ లాభాలు గడిస్తూ సమీకృత వ్యవసాయానికి నిలువుటద్దంలా నిలుస్తున్నారు.

సోదరుల సమష్టి కృషి… సేంద్రియ స్ఫూర్తి: సిద్దిపేట జిల్లాకు చెందిన లక్ష్మణ్, సత్తయ్య సోదరులు రసాయనాల వాడకం వల్ల భూసారం దెబ్బతిని, దిగుబడి తగ్గుతోందని గ్రహించారు. వెంటనే సేంద్రియ సాగు వైపు మళ్లారు. తమకున్న కోళ్లు, జీవాల వ్యర్థాలనే ఎరువుగా వాడుతూ నాలుగు ఎకరాల్లో వరి పండిస్తున్నారు. గతంలో ఎకరానికి రూ.20,000 ఖర్చయ్యే చోట, ఇప్పుడు కేవలం రూ.8,000 ఖర్చుతోనే ఎకరాకు 22 క్వింటాళ్ల దిగుబడి సాధించడం గమనార్హం.

దంపతుల దీక్ష… ఆరోగ్యమే రక్ష: వికారాబాద్ జిల్లాకు చెందిన అనూరాధ-రవి, అనిత-రామన్న దంపతులు తమ ఇరవై ఎకరాల పొలంలో రసాయనాలకు పూర్తిగా స్వస్తి పలికారు. పన్నెండు ఎకరాల్లో వరి, మిగిలిన భూమిలో పండ్లు, ఆకుకూరలు సాగుచేస్తున్నారు. జీవామృతం, వేప నూనె వంటి సహజ ఎరువులనే వాడుతూ, వరిలో ఎకరాకు ఇరవై క్వింటాళ్లకు పైగా దిగుబడి సాధిస్తున్నారు. పండ్ల తోటల ద్వారా ఏటా లక్షల్లో ఆదాయం ఆర్జిస్తూ, ఆరోగ్యకరమైన ఆహారాన్ని సమాజానికి అందించడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad