తెలంగాణ అసెంబ్లీ(TG Assembly) సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. అయితే సభ ప్రారంభం కాకముందు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, సుధీర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాధవరం కృష్ణారావు, సబితా ఇంద్రారెడ్డి, కేపీ వివేకానందలు కలిశారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు. జగదీశ్ రెడ్డి స్పీకర్పై ఏక వచనంతో ఎక్కడ కూడా మాట్లాడలేదని.. ఈ సస్పెన్షన్ అన్యాయం అని పేర్కొన్నారు. సభాసంప్రదాయాలు ఎక్కడా ఉల్లంఘించలేదన్నారు.
అనంతరం జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ విషయంపై అసెంబ్లీలోనూ హరీశ్ రావు(Harish Rao) మాట్లాడారు. జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ పై పున:పరిశీలన చేయాలని స్పీకర్ను కోరారు. జగదీశ్ రెడ్డి సభాపతిని అగౌరవంగా మాట్లాడలేదని, ఆయనకు అవకాశం ఇచ్చిఉంటే వివరణ ఇచ్చేవారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి స్పీకర్ చైర్ అంటే అపారమైన గౌరవం ఉందన్నారు. స్పీకర్ను ఏకగ్రీవంగా ఎన్నుకునే సమయంలో తమ అధినేత కేసీఆర్ సహకరించారని గుర్తు చేశారు.