Ktr tweets: ఆంధ్రప్రదేశ్ బీజేపీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన పీవీఎన్ మాధవ్, ఏపీ మంత్రి నారా లోకేష్తో ఉండవల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో మాధవ్ మంత్రికి శాలువా కప్పి, భారతదేశ పటాన్ని బహుమతిగా అందించారు. ప్రతిగా లోకేష్ సైతం ఏపీ బీజేపీ అధ్యక్షుడికి వెంకటేశ్వరస్వామి చిత్రాన్ని అందజేశారు. అయితే, మాధవ్ లోకేష్కు ఇచ్చిన భారతదేశ పటంపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
ఆ పటంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వేర్వేరుగా విభజించబడి లేవని, ఉమ్మడి రాష్ట్రంగానే చూపించబడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, బీజేపీ వైఖరిపై తన అసంతృప్తిని వెళ్లగక్కారు. తెలంగాణపై బీజేపీ ప్రభుత్వానికి, ఆ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని ప్రశ్నిస్తూ పలు అంశాలను ప్రస్తావించారు. కేటీఆర్ ట్వీట్పై, బీజేపీ చీఫ్ అందజేసిన చిత్రపటంపై తెలంగాణ వాదులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ తీరును సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఇంకా విడిపోలేదా?
ఆంధ్రరాష్ట్రం భౌగోళికంగా, విధానపరంగా ఆంధ్ర, తెలంగాణగా విడిపోయి దాదాపు 11 సంవత్సరాలు పూర్తయింది. రాజ్యాంగపరంగా రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, హక్కుల పంపకాలు కూడా జరిగిపోయాయి. అయినప్పటికీ బీజేపీ ఇంకా ఆంధ్ర-తెలంగాణను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గానే చూస్తోందనేది తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ వాదన. ఈ ఆరోపణలో భాగంగానే కేటీఆర్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ మంత్రి లోకేష్కి బహుమతిగా ఇచ్చిన ఫోటోను ఉటంకిస్తూ బీజేపీ తీరును తప్పుపట్టారు.
కేటీఆర్ వాదన ఇదే:
“మన సాంస్కృతిక గుర్తింపు, చరిత్రలో మన సరైన స్థానం, మన భౌగోళిక స్థానం కోసం తరతరాలుగా పోరాడుతున్న తెలంగాణ మ్యాప్ని కాదని, ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ మాధవ్ ఐక్య ఆంధ్రప్రదేశ్ మ్యాప్ను మంత్రి లోకేష్కి బహుమతిగా ఇచ్చి తెలంగాణ ఉనికిని విస్మరించడం ద్వారా మా పోరాటాన్ని తక్కువ చేశారు” అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదని, తెలంగాణ ప్రజలకు, రాష్ట్రానికి, మన పోరాటానికి, అమరవీరుల త్యాగాలకు, చరిత్రకు స్పష్టమైన నిర్లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
మాధవ్ని గౌరవంగా ఉద్దేశిస్తూనే కేటీఆర్ ఇలా అన్నారు: “సార్, ఇది మీ పార్టీ ప్రణాళికను ప్రతిబింబిస్తుందో లేదా రాజకీయ ఎజెండాను ప్రతిబింబిస్తుందో స్పష్టం చేయాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.” ఇది నిజమైన పర్యవేక్షణ అయితే, మీ పార్టీ నాయకత్వం నుండి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని తాను డిమాండ్ చేస్తున్నానని కేటీఆర్ తన ట్విట్టర్ పోస్ట్ ద్వారా కోరారు.
కేటీఆర్ పోస్ట్పై తెలంగాణవాదుల ఆగ్రహం
ఈ ఫోటో చూస్తే వీళ్లకున్న తెలంగాణ వ్యతిరేక మైండ్సెట్ ఎంత తీవ్రమైందో స్పష్టంగా అర్థమవుతుందని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్లయినా కూడా ఇంకా ఉమ్మడి రాష్ట్ర మ్యాప్ను చూపిస్తూ తమ వ్యతిరేకతను బహిరంగంగా ప్రదర్శిస్తున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు షేర్ చేస్తున్నారు.


