Thursday, September 12, 2024
HomeతెలంగాణThalasani: చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు

Thalasani: చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు

చేప ప్రసాదం కోసం హైదరాబాద్ వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జూన్ 9 వ తేదీన నిర్వహించే చేప ప్రసాదం పంపిణీ కి ప్రభుత్వ పరంగా చేపట్టవలసిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులు, చేప ప్రసాదం పంపిణీ చేయనున్న బత్తిన హరినాద్ గౌడ్ కుటుంబ సభ్యులు, పలు స్వచ్చంద సంస్థల నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బత్తిన హరినాద్ గౌడ్ కుటుంబ సభ్యులు వంశ పారంపర్యంగా ఎన్నో సంవత్సరాల నుండి చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారని తెలిపారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు ఎంతో బ్రహ్మాండంగా చేస్తూ వస్తుందని చెప్పారు. కరోనా ప్రారంభం నుండి చేప ప్రసాదం పంపిణీ చేయలేదని, మూడు సంవత్సరాల తర్వాత తిరిగి ఈ సంవత్సరం చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మృగశిర కార్తె రోజున పంపిణీ చేసే చేప ప్రసాదం కోసం మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాలు, వివిధ దేశాల నుండి కూడా లక్షలాది మంది వస్తుంటారని పేర్కొన్నారు. బత్తిన సోదరుల నివాసం నుండి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు పోలీస్ ఎస్కార్ట్ తో ప్రసాదం తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తమ బాధ్యతగా తీసుకొని ఈ సంవత్సరం కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని వివరించారు. వృద్దులు, వికలాంగులు, చిన్న పిల్లల కోసం ప్రత్యేక కౌంటర్ లను ఏర్పాటు చేసి చేప ప్రసాదం పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. అవసరమైన చేప పిల్లలను ప్రభుత్వమే మత్స్య శాఖ ఆధ్వర్యంలో సరఫరా చేస్తుందని తెలిపారు. ప్రజలు క్యూ లైన్ లో వెళ్ళే విధంగా పటిష్టమైన భారికేడ్ లను ఏర్పాటు చేయడంతో పాటు త్రాగునీరు కూడా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా జనరేటర్లు, అదనపు ట్రాన్స్ ఫార్మర్ లను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక హెల్త్ క్యాంప్ లు, అంబులెన్స్ లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. చేప ప్రసాదం కోసం వివిధ రాష్ట్రాల నుండి ఒకటి, రెండు రోజులు ముందే ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు చేరుకుంటారని, వారికి జైశ్వాల్ సమాజ్, అగర్వాల్ సమాజ్, శ్రీకృష్ణ కమిటీ, బద్రి విశాల్ పిట్టి వంటి పలు స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో సేవా దృక్పథంతో అల్పాహారం, భోజనం అందించే ఏర్పాట్లు చేస్తుంటారని, వారికి అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రహమతుల్లా బేగ్, కార్పొరేటర్ శంకర్ యాదవ్, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, జోనల్ కమిషనర్ రవి కిరణ్, వాటర్ వర్క్స్ డైరెక్టర్ కృష్ణ, సీజీఎమ్ ప్రభు, జిఎం షరీఫ్, సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ ఆబిడ్స్ పూర్ణచందర్ రావు, ట్రాఫిక్ డీసీపీ అశోక్ కుమార్, ఏసీపీ కోటేశ్వర్ రావు, ట్రాన్స్ కో సీజీఎమ్ నరసింహ స్వామీ, ఎస్ఇ సెంట్రల్ జోన్ బ్రహ్మం, డిఇ హేమచందర్, వైద్య ఆరోగ్య శాఖ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News