Sunday, October 6, 2024
HomeతెలంగాణUPF: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వ్యతిరేకతను చాటుకుంది: యూపీఎఫ్

UPF: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వ్యతిరేకతను చాటుకుంది: యూపీఎఫ్

మధ్యంతర బడ్జెట్ లో బీసీలకు తీవ్ర అన్యాయం

కాంగ్రెస్ ప్రభుత్వం తన బీసీ వ్యతిరేకతను బడ్జెట్ ద్వారా చాటుకుందని యునైటెడ్ పూలే ఫ్రంట్ కన్వీనర్ గట్టు రామచందర్ రావు ధ్వజమెత్తారు. మధ్యంతర బడ్జెట్ లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ చరిత్రలోనే బీసీ వ్యతిరేక విధానం ఉందని మరో సారి రుజువయ్యిందని స్పష్టం చేశారు.

- Advertisement -

సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గట్టు రామచందర్ రావుతో పాటు యూపీఎఫ్ నాయకులు మాట్లాడారు. గట్టు రామచందర్ రావు మాట్లాడుతూ…. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు వేసిన బడ్జెట్ కన్నా ఇంట్లో భార్య భర్తలు వేసుకునే బడ్జెట్ మేలని విమర్శించారు. ఐదేళ్లలో బీసీలకు రూ. లక్ష కోట్లు కేటాయిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన డిక్లకేషన్ లో హామీ ఇచ్చిందని, కానీ ఈ సారి కేవలం రూ. 8 వేల కోట్లు మాత్రమే కేటాయించారని ఎండగట్టారు. ఈ లెక్కన ఐదేళ్లలో కేవలం రూ 40 వేల కేటాయింపులే చేసే అవకాశం ఉందని, మిగితా రూ. 60 వేల కోట్లు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. బీసీ డిక్లరేషన్ ను ఒక టిష్యూ పేపర్ గా పక్కనపెట్టారని అన్నారు. బీసీ డిక్లరేషన్ లో పొందుపరిచిన అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆరు నెలల్లో కులగణన పూర్తి చేసి స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని స్పష్టం చేశారు.

కో-కన్వీనర్ తాడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ… మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టడమే ఒక కుట్ర అని ఆరోపించారు. బీసీలకు, ఎంబీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని తెలిపారు. బీసీలకు విపరీతమైన హామీలు ఇచ్చి ఇప్పుడు బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను అవహేళన చేసిందని మండిపడ్డారు. 14 బీసీ ఫెడరేషన్ లకు గాను ఒక్కొక్క ఫెడరేషన్ కు ఎంత కేటాయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఒక్కో ఫెడరేషన్ కు ప్రత్యేక నిధులు కేటాయించిందని, ఇప్పడు అలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

కో- కన్వీనర్ రాజారాం యాదవ్ మాట్లాడుతూ… జ్యోతిరావు పూలే సబ్ ప్లాన్ కు ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఎప్పుడు ఏర్పాటు చేస్తారో ప్రకటించాలని స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో రూ.50 కోట్ల తో కన్వెన్షన్ సెంటర్ లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ బడ్జట్ లో ఆ అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదని అడిగారు.

కో కన్వీనర్ బొల్ల శివ శంకర్ మాట్లాడుతూ…. కాంగ్రెస్ కల్లిబొల్లి మాటలు చెప్పి బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీసీలు కాంగ్రెస్ పార్టీకి తగ్గిదా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల వ్యతిరేకతను మానుకోవాలని సూచించారు. బీసీలకు తొలి బడ్జెట్ లోనే అన్యాయం చేయడం దారుణమని అన్నారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ప్రేమ లేదని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో యూపీఎఫ్ నాయకులు కోల శ్రీనివాస్, నాగేందర్ గౌడ్ , ఆర్.వి మహేందర్ కుమార్, ఆలకుంట హరి, గీతా గౌడ్, ఏల్చల దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News