Vakiti Srihari Takes Charge as Minister: తెలంగాణ మంత్రివర్గంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్ కొత్తగా స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే. పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా నియమితులైన ఆయన ఇవాళ తన బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్చారణల మధ్య బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం పెట్టారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సంబంధిత శాఖల అధికారులు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు. అనంతరం బాధ్యతలు స్వీకరించిన ఆయనకు మంత్రి జూపల్లి శుభాకాంక్షలు తెలియజేశారు.
కాగా ఇటీవల జరిగిన కేబినెట్ విస్తరణలో వాకిటి శ్రీహరితో పాటు అడ్లూరి లక్ష్మణ్, గడ్డం వివేక్ చోటు దక్కించుకున్న విషయం విధితమే. ప్రమాణ స్వీకారం అనంతరం వీరికి శాఖలను కేటాయించడంతో తాజాగా బాధ్యతలు చేపడుతున్నారు. అలాగే సచివాలయంలో కొత్త మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఫస్ట్ ఫ్లోర్ లో 13, 14, 15, 16 రూంలు, వివేక్ వెంకటస్వామికి సెకండ్ ఫోర్ లో 20, 21, 22 నంబర్ రూంలు, వాకిటి శ్రీహరికి సెకండ్ ఫ్లోర్ లో 26, 27, 28 నంబర్ రూంలు కేటాయిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక వివేక్ వెంకటస్వామికి కీలకమైన మైనింగ్, కార్మిక, ఉపాధి, జియాలజీ శాఖలు.. వాకిటి శ్రీహరి ముదిరాజ్ కి పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, క్రీడలు, యువజన సేవల శాఖలు.. అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ అభివృద్ధి, గిరిజన, మైనారిటీ సంక్షేమం, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, ట్రాన్స్ జెండర్ల సాధికారత శాఖలు కేటాయించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం కేబినెట్లో ఆరు మంత్రి పదవులు ఉండగా.. మూడు స్థానాలను అధిష్టానం భర్తీ చేసింది. మిగిలిన మూడు స్థానాలను కూడా స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం త్వరలోనే భర్తీ చేయనుంది. తాజాగా భర్తీ చేసిన మూడు స్థానాల్లో బడుగు, బలహీన వర్గాలకు కేటాయించాగా.. తర్వాత భర్తీ చేయబోయే మూడు మంత్రి పదవుల్లో అగ్రవర్ణాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.