Yashoda Hospital’s Artificial Intelligence in Healthcare: “ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇన్ హెల్త్కేర్” అనే అంశంపై దేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ సమావేశాన్ని నేడు యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో హైటెక్ సిటీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వైద్యులు, వైద్య పరిశోధకులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, AI సాంకేతిక నిపుణులు సహా 1000కి పైగా మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు మరియు ఛైర్మన్ గోరుకంటి రవీందర్ రావుతో కలిసి ప్రారంభించారు.
ఓ రోగి కేరింగ్లో నూతన ఒరవడులను అవలంభించేందుకు ఇలాంటి వేదికలు ఎంతో కీలకంగా మారతాయని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI-కృత్రిమ మేధ) ద్వారా సాంకేతికతతో కూడిన హెల్త్ కేరింగ్ మరింత అవగాహనను పెంచుతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ టెక్నాలజీ హెల్త్కేర్లో మంచి మార్పులు వస్తాయని తెలిపారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్య సంరక్షణ ఆవిష్కరణలలో ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని చెప్పారు. ప్రజారోగ్యం మరియు పౌర సేవల్లో కృత్రిమ మేధస్సు AI పాత్రను సైతం ఆయన వివరించారు.
హెల్త్ కేర్లో సంక్లిష్టమైన చికిత్సలు, ఇతర పద్ధతులను ఈ ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్తో పరిష్కారం చేయవచ్చని యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, వ్యవస్థాపకులు మరియు ఛైర్మన్ గోరుకంటి రవీందర్ రావు తెలిపారు. వైద్య-ఆరోగ్య సంరక్షణ డేటాను మరింత విశ్లేషించడానికి.. ఈ విధానాన్ని అర్థం చేసుకోవడానికి కృత్రిమ మేధ (AI) ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. కొన్ని సందర్భాల్లో ఏకంగా వ్యాధిని ఖచ్చితంగా నిర్ధారించడానికి మానవ నిపుణులతో సమానంగా లేదా అంతకంటే మెరుగ్గా పనిచేయగలదని పేర్కొన్నారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) అనేది వైద్య వ్యవస్థలోని వైద్యులపై ఏమాత్రం ప్రభావం చూపదని వారి సామర్థ్యాలను పెంపొందించడానికి ఉపయోగపడుతుందని అన్నారు.
అయితే, ఆరోగ్య సంరక్షణలో AI ని ఉపయోగించడంలో కొన్ని సమస్యలు కూడా ఉన్నయని తెలిపారు. ఇందులో డేటా గోప్యత, పారదర్శకత మరియు AI వ్యవస్థల ద్వారా వివక్ష వంటి అంశాలపై కీలకంగా వహించాలన్నారు. కృత్రిమ మేధస్సు AI ఆరోగ్య సంరక్షణలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నప్పటికీ, దాని అభివృద్ధి.. ఉపయోగంపై ఎంతో బాధ్యతాయుతంగా ఉండాలని రవీందర్ రావు తెలిపారు. “ఆరోగ్యరంగంలో కృత్రిమ మేధ” అంతర్జాతీయ వైద్య విజ్ఞాన సదస్సు విజయవంతంగా పూర్తి అయినట్లు ఆయన చెప్పారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఇన్ హెల్త్కేర్ ఒక విప్లవాత్మకమైన మార్పు అని క్లినికల్ డైరెక్టర్ & రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్. చినబాబు సుంకవల్లి అన్నారు. క్లినికల్ ప్రాక్టీస్లో కూడా కృత్రిమ మేధస్సు అద్భుతాల్ని సృష్టిస్తుందని పేర్కొన్నారు. AI అల్గోరిథమ్స్, రోగి హెల్త్ రిపోర్ట్స్ (ఎక్స్-రే, MRIలు)లను విశ్లేషించడంలో మరియు ఇతర వ్యాధులను, ముఖ్యంగా క్యాన్సర్ని ప్రారంభ దశలోనే గుర్తించడంలో మానవ నిపుణులతో సమానంగా లేదా కొన్ని సందర్భలలో అంతకంటే మెరుగ్గా పనిచేయగలదు అని అన్నారు. ఎన్నో ప్రాణాంతక వ్యాధులను తొలిదశలోనే గుర్తించడంవల్ల వాటికి సరైన సమయంలో అత్యుత్తమ చికిత్స మరియు వ్యాధి నివారణలో కూడా మనం ఎంతో ప్రగతి సాధించవచ్చని అభిప్రాయపడ్డారు.