MS Dhoni Daughter Ziva Video: ఈ కాలంలో ఎవరినైనా సరే మీరేం కావాలనుకుంటున్నారని అడిగితే.. ఏ మాత్రం తడబడకుండా సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనో, డాక్టర్, యాక్టర్, విదేశాల్లో ఉద్యోగం, వారసత్వంగా వస్తున్న బిజినెస్ చేయడం అనో.. ఇలా తప్పకుండా చెబుతారు. కానీ భారత క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ కూతురు మాత్రం అలా కాదు. పదేళ్ల వయసులోనే ఈ చిన్నారి ఆలోచనలు ఎంతో పరిపక్వత చెందాయి. సమాజం పట్ల బాధ్యత, తండ్రి గొప్పతనం.. ఇవన్నీ చిన్న వయసులోనే పెద్దగా ఆలోచించేలా చేశాయి. ఎంతకీ తాను కావాలనుకుంటుందో తెలుసా..
ఎంఎస్ ధోనీ, సాక్షిల ఏకైక కుమార్తె జీవా.. చిన్నప్పటి క్యూట్ ఫొటోస్ గతంలో నెట్టింట్లో చాలా హల్చల్ చేశాయి. ధోనీ, సాక్షిలకు 2010లో వివాహం కాగా.. 2015లో ఈ జంటకు జీవా జన్మించింది. కాగా, శుక్రవారం ఉత్తరాఖండ్లోని హరిద్వార్కు చెందిన ఓ రాజకీయ నాయకుడితో జరిగిన సంబాషణలో జీవా ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
నువ్వు పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నావని సదరు రాజకీయ నాయకుడు జీవాను అడగ్గా.. తాను పెద్దయ్యాక ప్రకృతి శాస్త్రవేత్త(నేచురలిస్ట్) కావాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. దీంతో ఆయన జీవాను మెచ్చుకున్నారు. చాలా గొప్పగా ఆలోచిస్తున్నావంటూ అభినందించారు. జీవాను ఆశీర్వదించారు. ఈ వీడియో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పదేళ్ల చిన్నారికి ఇలాంటి ఆలోచనలు, కోరికలు ఉండటం ఆనందం అంటూ అభినందించారు. చాలా గొప్ప మనిషి అవుతుందంటూ దీవిస్తున్నారు.


