Man Fights Off Leopard in Daring Attack : ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో ఓ వ్యక్తి అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించాడు. చావు అంచుల వరకు వచ్చిన చిరుతతో సింహంలా పోరాడి ప్రాణాలతో బయటపడ్డాడు. ధౌర్పూర్ ఫారెస్ట్ రేంజ్లోని జుగ్నుపూర్ గ్రామంలోని ఇటుక బట్టీ వద్ద పనిచేస్తున్న కార్మికులపై చిరుత దాడి చేయగా, ఈ సాహసోపేతమైన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల ద్వారా వెలుగులోకి వచ్చింది. 35 ఏళ్ల మిహిలాల్ అనే కార్మికుడు చిరుతతో ఒంటరిగా పోరాడి, దాన్ని నేలకు కూల్చిన దృశ్యాలు చూసినవారికి ఒళ్లు గగుర్పొడిచాయి.
లఖింపూర్ ఖేరీలో చిరుత దాడి: జూన్ 24, 2025, మంగళవారం మధ్యాహ్నం లఖింపూర్ ఖేరీ జిల్లాలోని ధౌర్పూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఈ ఘటన జరిగింది. జుగ్నుపూర్ గ్రామంలోని బబూరి ప్రాంతంలో ఉన్న మెడైలాల్ వర్మకు చెందిన ఇటుక బట్టీ వద్ద జరిగిన ఈ సంఘటన అందరినీ కలవరపరిచింది.
ఇటుక బట్టీలోని చిమ్నీలో దాక్కున్న ఓ చిరుత, 35 ఏళ్ల కార్మికుడు మిహిలాల్ (కొన్ని చోట్ల మిహిలాల్ గౌతమ్గా పేర్కొనబడ్డాడు) బూడిద తీసేందుకు వెళ్ళగా, ఒక్కసారిగా అతనిపై దాడి చేసింది. తనపై జరిగిన ఈ ఊహించని దాడి నుంచి తప్పించుకోవడానికి మిహిలాల్ చిరుతతో ధైర్యంగా పోరాడాడు. చిరుత మూతిని గట్టిగా పట్టుకుని నేలకు కూల్చి, దానిని అదుపులోకి తెచ్చేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. ఈ ఘటన మిహిలాల్తో పాటు అక్కడున్న వారిని తీవ్ర భయాందోళనకు గురిచేసింది.
హీరోలా పోరాడిన మిహిలాల్: వైరల్ వీడియోలు : వైరల్ అయిన వీడియోలో, మిహిలాల్ చిరుతతో కొన్ని నిమిషాల పాటు భీకరంగా పోరాడి, దాన్ని నియంత్రించేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. ఇటుక బట్టీలోని ఇతర కార్మికులు రాళ్లు, ఇటుకలు విసిరి మిహిలాల్ను కాపాడారు. దాడి ఒత్తిడితో అలసిపోయిన చిరుత సమీపంలోని అరటి తోటలోకి పారిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్ అవుతున్న ఈ వీడియోలకి నెటిజన్ల ఫిదా అయిపోతున్నారు.
చిరుతను పట్టుకునే ప్రయత్నంలో : ఘటనలో మిహిలాల్తో సహా ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. వారిలో అటవీ శాఖ అధికారి నృపేంద్ర చతుర్వేది, ఫారెస్ట్ గార్డ్ రాజేష్ కుమార్ దీక్షిత్, పీఆర్వీ గార్డ్ రామ్ సజీవన్, గ్రామస్థుడు ఇక్బాల్ ఖాన్ ఉన్నారు. చిరుత అరటి తోటలోకి పారిపోయిన తర్వాత, అటవీ శాఖ బృందం వెంటనే అక్కడికి చేరుకుని చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నించింది. అయితే, చిరుత మరోసారి దాడి చేయడంతో నలుగురు అటవీ సిబ్బందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని మొదట సీహెచ్సీ ధౌర్హారా ఆసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం లఖింపూర్లోని ఆసుపత్రికి తరలించారు.
అటవీ శాఖ చర్యలు – మానవ-వన్యప్రాణి సంఘర్షణ : గ్రామస్థుల సమాచారంతో, అటవీ అధికారి నృపేంద్ర చతుర్వేది ఆధ్వర్యంలో అటవీ శాఖ బృందం వెంటనే రంగంలోకి దిగింది. అరటి తోటలో దాక్కున్న చిరుతను వలలు, ఇతర సాధనాలతో గంటల తరబడి శ్రమించి విజయవంతంగా పట్టుకున్నారు. ఈ ఘటన లఖింపూర్ ఖేరీలో పెరుగుతున్న మానవ-వన్యప్రాణి సంఘర్షణ తీవ్రతను స్పష్టం చేస్తోంది. గత కొన్ని వారాలుగా ఈ ప్రాంతంలో చిరుత దాడులు పెరిగాయి, మే 2025లో ధౌర్పూర్ రేంజ్లోనే రషీద్ అనే యువకుడిపై కూడా చిరుత దాడి చేసింది.