2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ప్రతీకారం తీర్చుకుంటుందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) విమర్శించారు. పార్లమెంట్లో సౌత్ స్టేట్స్ ప్రాతినిథ్యం తగ్గించే కుట్ర చేస్తున్నారంటూ ఎక్స్ వేదికగా ఆమె మండిపడ్డారు.
“డీ లిమిటేషన్ ద్వారా సౌత్ స్టేట్స్పై నిజంగా బీజేపీది ప్రతికారమే. దక్షిణాది రాష్ట్రాల్లో తన ప్రభావం లేనందుకే ఈ కక్ష్య సాధింపు చర్య. పార్లమెంట్ లో సౌత్ ప్రాతినిథ్యం తగ్గించే కుట్రలో భాగం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు అక్షర సత్యం. జనాభా ప్రాతిపదికన డీ లిమిటేషన్ చేయడం అంటే, కుటుంబ నియంత్రణ పాటిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నట్లే.
1971 తర్వాత సౌత్ కంటే నార్త్ లోనే అత్యధిక జనాభా పెరిగింది. ఒక్క ఉత్తర ప్రదేశ్ రాష్ట్రమునే ఉదాహరణగా తీసుకుంటే 8 కోట్ల నుంచి 24 కోట్ల జనాభా పెరిగింది. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం యూపీలో 80 నుంచి 143 సీట్లకు అదనంగా పెరుగుతున్నట్లే. బీహార్ లో 40 నుంచి 79 కి పెరిగే స్థానాలు కలుపుకుంటే రెండు రాష్ట్రాల నుంచే 222 ఎంపీలు పార్లమెంట్ లో ప్రాతినిథ్యం వహించే పరిస్థితి. ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం పెరిగే సీట్లు 12 మాత్రమే. అంటే 42 నుంచి 54కి మాత్రమే.
సౌత్ రాష్ట్రాల్లో పెరిగే సీట్లు పదుల సంఖ్యలో ఉంటే, ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ సంఖ్య వందలాదిగా ఉంటోంది. డీ లిమిటేషన్ పై బీజేపీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకుండా అఖిలపక్షం ఏర్పాటు చేయాలి. డీ లిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతుంటే ఏపీ సీఎం చంద్రబాబు గారు స్పందించకపోవడం తగదు. దాటవేసే ధోరణి అవలభించడం అన్యాయం. బీజేపీతో కూటమి పొత్తులో ఉన్నారని మౌనం వహిస్తే చేతులు కాలాక ఏం పట్టుకున్నా ఉపయోగం లేదని చంద్రబాబు గారు గ్రహించాలి. డీ లిమిటేషన్ పై మీ వైఖరి వెంటనే చెప్పాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాము” అని తెలిపారు.