Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నిక నగారా మోగనుంది. ఈమేరకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఇప్పటికే ఈ ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చలు జరిపారు. ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. సోమవారం జరిగే మంత్రివర్గం సమావేశంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఓ నిర్ణయానికి రానున్నట్లు సమాచారం. పంచాయతీ ఎన్నికలు ముందు నిర్వహించాలా.. లేదా పరిషత్ ఎన్నికలు తొలుత జరపాలా అనే దానిపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వం ప్రస్తుతం రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ పథకం అమలు ద్వారా గ్రామీణ ఓటర్ల మద్దతు పొందాలని లక్ష్యంతో ఉంది. రైతు భరోసా పథకం అమలు ఈ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలుడనుందని సమాచారం. అంటే మరో వారం లేదా పది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కీలకమైన బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఎన్నికలకు ముందే రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేయనుంది.
ఈ ఎన్నికల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పట్టు సాధించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. తద్వారా ప్రభుత్వంపై మరింత పట్టు సాధించేందుకు వీలుగా ఉంటుందని యోచిస్తున్నారు. అలాగే ప్రతిపక్షాల విమర్శలకు కూడా చెక్ పెట్టాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందుకే ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజల్లో ఉండాలని.. ప్రభుత్వానికి నష్టం కలిగించేలా అనవసరమైన ప్రకటనలు చేయొద్దని సూచించారు.
మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికల సన్నాహాలను పూర్తి చేసింది. బ్యాలెట్ బాక్స్లను సిద్ధం చేయడంతో పాటు ఓటరు జాబితాలు, పోలింగ్ స్టేషన్లను ఖరారు చేసింది. కాగా రాష్ట్రంలో 12,815 గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ, కార్పొరేషన్లలోని 1.14 లక్షల వార్డులు, 538 జడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు కావొస్తున్న తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారనున్నాయి.