Old woman in the garbage dump: మానవత్వం మంట కలిసిపోతోంది. ముంబైలో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. క్యాన్సర్తో బాధపడుతోన్న ఓ 60 ఏళ్ల వృద్ధురాలిని తన మనవడే.. చెత్తకుప్ప పక్కన వదిలేసి వెళ్ళాడు. క్యాన్సర్తో పోరాడుతోన్న బాధితురాలు ముంబైలోని ఆరే కాలనీలో చెత్తకుప్ప పక్కన నిస్సహాయ స్థితిలో పడి ఉండగా స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు.
బాధితురాలి పేరు యశోద గైక్వాడ్ కాగా.. ఆ వృద్ధురాలిని ఆమె మనవడే వదిలేసి వెళ్లాడని, నిస్సహాయ స్థితిలో ఉన్న తనను ఆమె కుటుంబ సభ్యులు కనీసం పట్టించుకోలేదని సమాచారం అందుతోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ఎలా వెలుగులోకి వచ్చింది?
శనివారం ఉదయం ముంబై పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా.. రోడ్డు పక్కన చెత్తకుప్ప దగ్గర వృద్ధురాలు అచేతనంగా పడి ఉండటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. చర్మ క్యాన్సర్తో బాధపడుతున్న బాధితురాలు గైక్వాడ్.. దాదాపు అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించారు.
“బాధితురాలిని మేము చూసినప్పుడు తను పూర్తిగా కదలలేక అచేతనంగా పడి ఉంది. మేము ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు, తన మనవడు తనను ఇక్కడికి తీసుకొచ్చి వదిలివెళ్లాడని చెప్పింది” అని ఈ విషయం తెలిసిన ఓ పోలీసు అధికారి మీడియాకు తెలిపారు.
ఆసుపత్రికి ఆలస్యంగా:
బాధితురాలిని ఉదయమే గుర్తించినప్పటికీ తనను ఆసుపత్రిలో చేర్చడానికి దాదాపు రోజంతా పట్టింది. ఆమె పరిస్థితి, స్పష్టమైన గుర్తింపు లేకపోవడాన్ని కారణం చూపుతూ అనేక ఆసుపత్రులు ఆమెను చేర్చుకోవడానికి నిరాకరించినట్లు సమాచారం. చివరకు సాయంత్రం 5:30 గంటలకు ఆమెను కూపర్ ఆసుపత్రిలో చేర్చగలిగినట్లు తెలుస్తోంది. అనారోగ్యంతో ఉన్న వృద్ధురాలికి వైద్య సహాయం అందించడంలో జరిగిన ఈ జాప్యం, వృద్ధుల పట్ల, ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న, కుటుంబ మద్దతు లేని వారి పట్ల వ్యవహరించే తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
పోలీసుల దర్యాప్తు:
బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ, పోలీసులకు రెండు చిరునామాలను అందించగలిగింది. అందులో ఒకటి మలాడ్ ప్రాంతానికి, మరొకటి కండివాలి ప్రాంతానికి చెందిన అడ్రస్ లు కాగా.. అవి ఆమె బంధువులకు సంబంధించినవిగా వారు భావిస్తున్నారు. ఈ రెండు లీడ్స్పై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె కుటుంబాన్ని గుర్తించడానికి, ఆమెను వదిలివేయడానికి దారితీసిన పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కేసు నమోదు చేసి.. ఆమె కుటుంబ సభ్యులను గుర్తించడానికి పోలీసులు ఆమె ఫోటోను పలు పోలీస్ స్టేషన్లకు పంపారు.
నెటిజన్ల ఆగ్రహం:
ఈ కేసు స్థానికులలో, సోషల్ మీడియా వినియోగదారులలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. గ్రాండ్ పేరెంట్స్ పై జాలి లేకుండా ఇలా వదిలించుకోవాలని చూసే వారిపై, వృద్ధులను నిర్లక్ష్యం చేసే లేదా వదిలివేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వృద్ధులకు రక్షణ కల్పించే విషయంలో సమాజం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.