Wednesday, June 25, 2025
HomeTS జిల్లా వార్తలుHarish Challenge To CM Revanth: బనకచర్లపై చర్చకు సిద్ధమా: హరీష్ రావు సవాల్

Harish Challenge To CM Revanth: బనకచర్లపై చర్చకు సిద్ధమా: హరీష్ రావు సవాల్

Harish Rao Comments: బనకచర్లపై సీఎం రేవంత్ చర్చకు సిద్ధమా అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. మంగళవారం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రేవంత్ ప్రభుత్వం రైతులకు క్షమాపణలు చెప్పిన తరువాతే రైతుభరోసా ఉత్సవాలు నిర్వహించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహాలను మారిస్తే ఊరుకోమని హరీష్ రావు హెచ్చరించారు. అందాల పోటీలను నిర్వహించలేనివారికి విజన్ 2047 ఎందుకని ఆయన ఎద్దేవా చేశారు. బనకచర్లపై చర్చకు రేవంత్, ఉత్తమ్ ఎవరొచ్చినా తాను రెడీ అని హరీష్ రావు అన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2 వేలు ఇచ్చి దగా చేసిందన్నారు. ఇప్పుడు స్థానిక ఎన్నికలు దగ్గర పడ్డాయని, అందుకే రైతు భరోసా 12 వేలు జమ చేశారని విమర్శించారు.

ALSO READ: https://teluguprabha.net/sports-news/team-india-score-five-test-centurys-in-a-match-for-the-first-time-in-test-history/

బీఆర్ఎస్ హయాంలో రైతులందరికీ రైతు భరోసా ఇచ్చామని హరీష్ అన్నారు. కేబినెట్ మీటింగ్‌లు పెడితే సరిపోదని, నిర్ణయాలు అమలు చేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కేబినెట్ మీటింగ్‌లు మంత్రుల పంచాయితీలకే సరిపోతుందని ఎద్దేవా చేశారు. దేశమంతా రాహుల్ కాంగ్రెస్ ఉంటే తెలంగాణలో మాత్రం రేవంత్ కాంగ్రెస్ ఉందని ఆరోపించారు. గత వానకాలం రైతు భరోసా ఎగ్గొట్టారని, యాసంగిలోనూ మొండిచెయ్యి చూపారని, 19 నెలల కాలంలో రైతులు అరిగోస పట్టలేదనా అని హరీష్ ప్రశ్నించారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని ఓట్ల కోసం విజయోత్సవాల పేరిట సంబురాలు జరపడం రైతులను మోసం చేయడమే అని హరీష్ రావు మండిప‌డ్డారు.

ALSO READ: https://teluguprabha.net/telangana-news/deputy-cm-bhatti-vikramarka-says-rythu-bharosa-created-history-in-telangana/

కాగా, రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఏపీ తలపెట్టిన గోదావరి – బనకచర్ల ప్రాజెక్ట్‌ను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని, దానిపై ఏ పోరాటానికైనా సిద్ధమని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. నిన్న సెక్రటేరియట్‌లో జరిగిన కేబినేట్ భేటీ అనంతరం మంత్రులు ఈ విషయాన్ని వెల్లడించారు. బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకించాలని మంత్రివర్గం తీర్మానించింది. బనకచర్లపై ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి జులై మొదటి వారంలో సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసేందుకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. కాగా, ప్రాజెక్టును అడ్డుకోవాలని ఇప్పటికే కేంద్ర జల వనరుల శాఖ మంత్రిని ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి స్వయంగా ఢిల్లీకి వెళ్లి కలిసి విజ్ఞప్తి చేశారు. ఈనేపథ్యంలో చట్టం, న్యాయపరంగా బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టాలని, అన్ని వేదికలను ఉపయోగించుకోవాలని కేబినెట్ తీర్మానించింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల అధికారుల కమిటీ సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖపైనా కేబినెట్ చర్చించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న పూర్తి వివరాలను ఈనెల 30 లోగా కమిషన్‌కు అందివ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో సీనియర్ అధికారులకు ఈ బాధ్యత అప్పగించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News