Eatala Rajendar comments on Phone Tapping Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. విచారణలో భాగంగా అధికారులు ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. అనంతరం ఈటల మీడియాతో మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛను హరించే అధికారం ఎవరికి లేదన్నారు. సంఘవిద్రోహ శక్తులవి కాకుండా నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేయడం దారుణమని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకులు, కుటుంబ సభ్యులు, పిఆర్వోల ఫోన్లు ట్యాపింగ్ చేయడం జరిగిందని తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి బాధితుడిని తనేనన్నారు. 2018 ఎన్నికల సమయంలోనే తనను ఓడించాలని ప్రయత్నించారంటూ బాంబ్ పేల్చారు. తాను ఏ కార్యకర్తతో మాట్లాడుతున్నాను.. ఏం మాట్లాడుతున్నా అనే విషయాలను ట్యాప్ చేశారన్నారు. దమ్ము, ధైర్యం లేని మాత్రమే ఇలాంటి పనికిమాలిన పని చేస్తారని మండిపడ్డారు. హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలోనూ, గద్వాలలో పోటీ చేసినప్పుడు తన ఫోన్ ట్యాప్ జరిగిందని ఈటల ఆరోపించారు.
మునుగోడు బై ఎలక్షన్లో కూడా తమ పార్టీ ప్రణాళికలను కూడా పూర్తిగా వినేవారని చెప్పారు. అధికారులందరూ కేసీఆర్కు తొత్తులుగా వ్యవహరించారని ఫైర్ అయ్యారు. ఎస్ఐబీ చీఫ్గా ప్రభాకర్ రావు నియామకం అక్రమం అని తెలిపారు. ప్రభాకర్రావు నిబంధనలు అతిక్రమించి కేసీఆర్ కోసం పనిచేశారని ఆగ్రహించారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని విమర్శించారు. అందుకే ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఇతర అక్రమాలపై కమిటీలు వేశారు కానీ దర్యాప్తు వేగంగా జరగడం లేదని పేర్కొన్నారు. చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. నింధితులపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈటల నిలదీశారు.