Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలుKarimnagar: నకిలీ విత్తనాలా? పీడీ యాక్ట్ తప్పదు

Karimnagar: నకిలీ విత్తనాలా? పీడీ యాక్ట్ తప్పదు

నకిలీ విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులను విక్రయించే వ్యాపారులు, మధ్యదళారీలు, సంస్థలకు చెందిన వ్యక్తులపై క్రిమినల్ కేసులను నమోదు చేయడంతోపాటు పిడియాక్టులను అమలు చేస్తామని కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు హెచ్చరించారు. రైతులను మోసం చేసే చర్యలకు పాల్పడే వారిని సహించబోమని స్పష్టం చేశారు.

- Advertisement -

కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా ఎరువులు, క్రిమిసంహారక మందులను విక్రయించే దుకాణాలు, ఏజెన్సీలపై పోలీస్ శాఖ నిఘా కొనసాగుతోందని తెలిపారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులను విక్రయించే వారికి సంబంధించి ఏదైనా సమాచారం ఉన్నట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని చెప్పారు. వానాకాలం సాగు ప్రారంభం అవుతున్న తరుణంలో కొందరు వ్యాపారులు, ఏజెన్సీల నిర్వాహకులు, మధ్యదళారీలు నకిలీ విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులను విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీస్ శాఖ దృష్టికి వచ్చిందన్నారు. రైతులకు పంటల సాగులో ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటున్నదని, రైతులను మోసం చేసే చర్యలకు వ్యక్తులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుందని చెప్పారు. రైతులు నకిలీ విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకునేందుకు కమీషనరేట్ పోలీసులు సిద్ధమయ్యారని తెలిపారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు ఎవరైనా విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందించే వారి పేర్లను గోప్యంగా ఉంచడంతోపాటు నగదు పారితోషికం అందజేస్తామని ప్రకటించారు. స్థానిక పోలీసులు లేదా టాస్క్ ఫోర్స్ ఏసిపి ఫోన్ నెంబర్ 87126 70760, ఇన్స్పెక్టర్ నెంబర్ 8712670708 లకు సమాచారం అందించాలని కోరారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల విక్రయాలు జరిపినా, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల విక్రయాలు, అక్రమ రవాణాలో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు ఉన్న వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కమీషనరేట్ పరిధిలోని దుకాణాలు, ఏజెన్సీలలో పోలీసులు తనిఖీలను నిర్వహించనున్నారని తెలిపారు. గత 2019 సంవత్సరంలో నకిలీ విత్తనాలు, క్రిమిసంహారక మందులను విక్రయించిన వ్యాపారులపై పిడియాక్టలను అమలు చేసిన విషయం విదితమే. పిడియాక్ట్ అమలైనట్లయితే ఒక సంవత్సరం పాటు జైలు జీవితాన్ని గడుపాల్సిన దుస్థితి ఏర్పడుతుందని చెప్పారు. పిడియాక్ట్ అమలైన వారికి ఎలాంటి బేయిల్ లభించదని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News