2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.3.22 లక్షల కోట్ల బడ్జెట్(AP Budget 2025)ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించింది. ఈ బడ్జెట్కు సీఎం చంద్రబాబు(Chandrababu) అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఇతర మంత్రులు పాల్గొన్నారు. అసెంబ్లీలో మంత్రి పయ్యావుల, మంత్రి కొల్లు రవీంద్ర మండలిలో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు సమాచారం. వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు. రూ.50,000 కోట్ల దాకా నిధులు కేటాయించే అవకాశముంది.


బడ్జెట్ను ప్రవేశపెట్టే ముందు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తన నివాసంలో అధికారులతో కలిసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం అమరావతిలోని వెంకటాయపాలెం టీటీడీ ఆలయాన్ని సందర్శించి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. 2025-26 బడ్జెట్ ప్రతులను శ్రీవారి పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలకు భారీగా నిధులు కేటాయించనున్నట్లు సమాచారం.
